CM Revanth Reddy | హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రతిపాదనకు సంబంధించిన డీపీఆర్, ట్రాఫిక్పై అధ్యయనం త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. మెట్రోలైన్ పొడిగింపు, ప్రస్తుత పరిస్థితి, రెండోదశపై అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రస్తుతం ఉన్న మార్గాలు, కొత్త ప్రణాళికలపై అధికారులను ఆరా తీశారు. ఎల్బీనగర్-హయత్నగర్, మియాపూర్-పటాన్చెరు, రాయదుర్గం-ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఎంజీబీఎస్-ఎయిర్పోర్టు మార్గాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఎక్కువ ప్రాంతాలకు ఉపయోగపడేలా మెట్రో విస్తరణ ఉండాలన్నారు. పాతబస్తీ మెట్రోపై స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించాలని సీఎం అధికారులకు సూచించారు. మతపరమైన, చారిత్రక కట్టడాలపై ఎలాంటి ప్రభావం పడకుండా రోడ్ల విస్తరణ చేపట్టాలన్నారు. ఇక రాయదుర్గం-ఎయిర్పోర్టు మెట్రో ప్రతిపాదనను పెండింగ్లో పెట్టాలని ఆదేశించారు.
దారుల్షిఫా, శాలిబండ మధ్య రోడ్డ విస్తరణపై చర్చించాలని, మత, చారిత్రకకట్టడాల ప్రభావం లేకుండా రోడ్డు విస్తరణ చూడాలని, అవసరమైతే వ్యక్తిగతంగా పరిశీలించి ప్రజాప్రతినిధులతో చర్చిస్తానన్నారు. విమానాశ్రయం – కందుకూరు మెట్రో ప్రణాళిక రూపొందించాలని, మూడో దశ జేబీఎస్ -శామిర్పేట మార్గం విస్తరించాలన్నారు. మూడోదశలో ప్యారడైజ్ నుంచి కండ్లకోయ వరకు విస్తరించాలని సూచించారు. మెట్రోపై కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రికి లేఖ రాయాలని చెప్పారు.