హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): పీపీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి గురవారం ఉదయం ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఢిల్లీలో జరుగనున్న కాంగ్రెస్ ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. రాష్ట్రం నుంచి 14 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ఇంకా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లు మిగిలి ఉన్నాయి. వీటికి సీఈసీ అభ్యర్థులను ఖరారు చేయనున్నది.
ఈ మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడం పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా తయారైంది. ముఖ్యంగా ఖమ్మం టికెట్ను తమ కుటుంబ సభ్యుల కోసం ఆశించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావులలో ఎవరికీ టికెట్ ఇచ్చేది లేదని అధిష్ఠానం తేల్చి చెప్పింది. దీంతో తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు పేరు తెరపైకి రాగా.. అంతకుముందు రామసహాయం రఘురాంరెడ్డి పేరు దాదాపు ఖరారు అయినట్టేనన్న ప్రచారం జరిగింది.
అయితే రఘురాంరెడ్డి.. పొంగులేటికి వియ్యంకుడు. ఇప్పటికీ రఘురాంరెడ్డి, వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, మండవ వెంకటేశ్వర్రావు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఇక కరీంనగర్ అభ్యర్థి విషయంలోనూ ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఇక్కడి నుంచి మొదట మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్రెడ్డి పేరు బలంగా వినిపించింది. ఆ తర్వాత వెలమ సామాజికవర్గానికి చెందిన రాజేశ్వర్రావు పేరు తెరపైకి వచ్చింది. అసెంబ్లీ టికెట్లలో బీసీలకు బీసీలకు అన్యాయం జరిగిందన్న విమర్శ నేపథ్యంలో లోక్సభ సీట్లలో ప్రాధాన్యం ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు.
ఇప్పటికి ప్రకటించిన 14 మందిలో ముగ్గురు మాత్రమే బీసీలు ఉండటంతో, కరీంనగర్ నుంచి కూడా ఆ సామాజికవర్గానికి చెందిన వారికే టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది. హైదరాబాద్ స్థానంలో మజ్లిస్తో కుదిరిన అవగాహన మేరకు కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నట్టు సమాచారం. ఇలా ఉండగా ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి ప్రముఖ జర్నలిస్ట్ రజత్శర్మ నిర్వహించే ఆప్ కీ అదాలత్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రేవంత్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఢిల్లీ వెళ్లడం ఇది 13వ సారి కావడం గమనార్హం.