హైదరాబాద్ : డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచన పక్కన పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు సేవ చేస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని పేర్కొన్నారు. శుక్రవారం బాగ్ లింగంపల్లిలోని బీఆర్ అంబేద్కర్ లా కాలేజీ అలుమ్నీ మీట్, గ్రాడ్యుయేషన్ డేలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు వివేక్, వినోద్ రామాయణంలో లవకుశుల లాంటివారని కొనియాడారు. ఎంత సంపాదించామనేది కాదు.. సమాజానికి ఎంత పంచామనేది సామాజిక బాధ్యత అనేది కాకా (G. Venkataswamy) విధానమన్నారు.
అటువంటి కాకా వర్ధంతి రోజు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం గొప్ప కార్యక్రమమని ప్రశంసించారు. గత 50 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులను తీర్చి దిద్దిన ఘనత కాకా సొంతమని వ్యాఖ్యానించారు. దేశ నిర్మాణంలో ఆయన వారి సామాజిక బాధ్యతను నిర్వర్తించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు విద్యనందిస్తున్న ఘనత కాకా కుటుంబానిదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కాకా ఫ్యామిలీ ముందుందన్న సీఎం ఢిల్లీలోని కాంగ్రెస్ ఆఫీస్ కూడా కాకా పేరునే ఉందని తెలిపారు. దేశ నిర్మాణంలో కూడా కాకా పాత్ర ఉందన్నారు.
దేశం కోసం గాంధీ కుటుంబం ఎలానో తెలంగాణకు కాకా కుటుంబం అలా అని చెప్పుకొచ్చారు. బీఆర్ అంబేద్కర్ కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వం నుంచి చేయూతనందించేందుకు సిద్దమని రేవంత్ హామీ ఇచ్చారు. కళాశాల సమయంలో భవిష్యత్ కు బంగారు పునాదులు వేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా డ్రగ్స్, మద్యం వంటి చెడు అలవాట్లకు బానిస కాకూడదని చెప్పారు. అంతకుముందు కాలేజీలో కాకా విగ్రహాన్ని సీఎం రేవంత్ అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు వివేక్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.