వికారాబాద్, డిసెంబర్ 30, (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇప్పటికే ఆ నియోజకవర్గాన్ని మహబూబ్నగర్ జిల్లాలో కలిపేందుకు ముమ్మర కసరత్తు జరుగుతుండగా.. తాజాగా నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది మండలాలను కలిపి కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కాడా)ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతోపాటు త్వరలో కొడంగల్ను రెవిన్యూ డివిజన్గానూ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ ప్రక్రియను పూర్తి చేసి లోక్సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం కొడంగల్ రెవిన్యూ డివిజన్ ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని కొడంగల్, బొంరాసుపేట్, దుద్యాల, దౌల్తాబాద్ మండలాలను, నారాయణపేట జిల్లాలోని కోస్గి, మద్దూర్, కొత్తపల్లి, గుండుమాల్ మండలాలను కలిపి కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(కాడా)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాడా చైర్మెన్గా వికారాబాద్ కలెక్టర్ సీ నారాయణరెడ్డిని నియమించింది. స్పెషల్ అధికారిగా నాగర్కర్నూల్ ఆర్డీవో పనిచేస్తున్న కే వెంకట్రెడ్డిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నియోజకవర్గ కేంద్రం కొడంగల్లో కాడా అథారిటీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. కాడా అథారిటీ కార్యాలయానికి అనువైన ప్రభుత్వ కార్యాలయాలను చూడాలని కొడంగల్ తాసీల్దార్ను కలెక్టర్ ఆదేశించారు. కాడా అథారిటీకి స్పెషల్ అధికారితోపాటు ప్రత్యేకంగా ఒక తాసీల్దార్, డిప్యూటీ తాసీల్దార్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లతో బృందాన్ని నియమించనున్నారు. మరోవైపు ప్లానింగ్ డిపార్ట్మెంట్ నోడల్ డిపార్ట్మెంట్గా వ్యవహరించనుంది. అవసరమైన పోస్టుల మంజూరుతోపాటు ఆర్థిక శాఖ సమన్వయంతో బడ్జెట్ను మంజూరు చేయనున్నారు.
కాడా అథారిటీ స్పెషల్ అధికారితోపాటు వారి బృందం కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికను సిద్ధం చేయనున్నది. వారం రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికను రూపొందించే పనులు ప్రారంభంకానున్నాయి. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా ఏప్రిల్-మే నెలలోగా ప్రణాళికను సిద్ధం చేసేందుకు చర్యలు చేపట్టారు. కోడ్ ముగిసిన అనంతరం అభివృద్ధి పనులకు టెండర్లు ఆహ్వానించి, పనులు ప్రారంభించనున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో 10 జిల్లాల నుంచి 33 జిల్లాల ఏర్పాటు చేసిన దరిమిలా కొడంగల్ నియోజకవర్గం నారాయణపేట, వికారాబాద్ జిల్లాల పరిధుల్లోకి వచ్చింది. ఇదే క్రమంలో నియోజకవర్గంలోని కొన్ని మండలాలు వికారాబాద్ జిల్లా తాండూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోకి రాగా, మరికొన్ని మండలాలు నారాయణపేట జిల్లా నారాయణపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వచ్చాయి. అయితే కొడంగల్ను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని సీఎం రేవంత్రెడ్డి యోచిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో సంకేతాలిచ్చినట్టు తెలిసింది. సీఎం ఆదేశంతో అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టనున్నది. లోక్సభ ఎన్నికల తర్వాత కొడంగల్ రెవెన్యూ డివిజన్ ప్రకటన ఉండే అవకాశమున్నది.