హైదరాబాద్: మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్, పారా మెడికల్ కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. దీనికోసం కామన్ పాలసీని తీసుకురావాలని అధికారులకు ఆదేశారు. కొడంగల్లో మెడికల్, నర్సింగ్ కాలేజీలను ఏర్పాటుచేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చేలా చూడాలన్నారు. సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. సమావేశానికి మంత్రి దామోదర రాజ నర్సింహ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎయిమ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. తద్వారా ఉస్మానియా, నిమ్స్ దవాఖానలపై భారం తగ్గుతుందని చెప్పారు. ఎయిమ్స్ను సందర్శించి పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని ఆదేశించారు. హాస్పిటల్లో పూర్తిస్థాయి వైద్య సేవల కోసం అవసరమైతే తానే స్వయంగా కేంద్రమంత్రిని కలిసి వివరిస్తానని చెప్పారు.
ప్రాంతాల వారీగా ఉన్న ప్రభుత్వ దవాఖానల్లో కొన్నింటిని గుర్తించి వాటికి సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో హౌస్ కీపింగ్ నిర్వహణ బాధ్యత పెద్ద ఫార్మా కంపెనీలకు అప్పగించాలన్నారు. నిర్వహణ ఖర్చును వారే భరించేలా చూడాలన్నారు. ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్లో ఏదో ఒక దవాఖానలో దీనిని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు తీరు, నిధులకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్కు పెండింగ్లో ఉన్న ఆరోగ్యశ్రీ బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ప్రతీ నెల 15వ తేదీలోగా ప్రభుత్వ దవాఖానలకు ఆరోగ్యశ్రీ బిల్లులు విధిగా విడుదల చేయాలన్నారు. ప్రతీ మూడు నెలలకోసారి విధిగా ప్రైవేటు హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదలయ్యేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఉస్మానియా దవాఖాన విస్తరణలో ఉన్న సమస్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మంగళవారం ఉస్మానియా హెరిటేజ్ భవనం విషయం కోర్టులో బెంచ్పై రానుందని తెలిపారు. అయితే న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ఎలా ముందుకు వెళ్లాలనే అంశయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.