హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు తుంటి ఎముక విరిగి ఆస్పత్రిలో చేరడంపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు ఆయన తెలిపారు. కేసీఆర్కు మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ (X) ద్వారా వెల్లడించారు.
‘మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీశాను. ఆస్పత్రిని సందర్శించి ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు నాకు నివేదించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించాను. కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. అంతకు ముందు కేసీఆర్ చికిత్స తీసుకుంటున్న ఆస్పత్రి దగ్గర ప్రభుత్వం భద్రతను పెంచింది.
కాగా, కేసీఆర్ గురువారం అర్ధరాత్రి తన ఫామ్హౌస్లోని బాత్రూమ్లో కాలు జారి పడిపోవడంతో ఎడమ కాలి తుంటి ఎముక విరిగింది. తుంటికి రెండు చోట్ల గాయమైనట్టు వైద్యులు తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యంపై యశోద డాక్టర్లు హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు. సిటీ స్కాన్ అనంతరం ఎడమ హిప్ రీప్లేస్మెంట్ అవసరమని వైద్యులు సూచించారు. ఇలాంటి కేసుల్లో కోలుకునేందుకు 6-8 వారాల విశ్రాంతి అవసరమన్నారు. ఈ సాయంత్రం నాలుగు గంటలకు సర్జరీ చేయనున్నట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.