RRR | రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో ఆర్ఆర్ఆర్, అర్అండ్బీ, నేషనల్ హైవే ప్రాజెక్టులపై శుక్రవారం నాడు సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా నాగ్పూర్ – విజయవాడ కారిడార్కు సంబంధించి తెలంగాణ జిల్లాల్లో అసంపూర్తిగా మిగిలిన భూసేకరణ ప్రక్రియను సంక్రాంతిలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అటవీ శాఖ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
అటవీశాఖ, ఆర్ అండ్ బీ శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆ రెండు శాఖల్లో ఒక్కో అధికారిని ఇందుకు ప్రత్యేకంగా నియమించాలన్నారు. రెండు శాఖలు సమావేశమై సంబంధిత శాఖల పరిధిలోని భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రోడ్డు వెడల్పు ఉండే విధంగా డిజైన్ చేయాలన్నారు. కొత్త గ్రామ పంచాయతీలతో సహా ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండాల్సిందేనని.. ఇందుకు సంబంధించి విడతల వారీగా నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక ఏ గ్రామానికి రోడ్డు లేదనే మాట వినబడొద్దని అన్నారు.