CM Revanth Reddy | ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఎలా సరఫరా చేయాలన్న అంశంపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. అధ్యయన కమిటీ సభ్యులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కమిషనర్ శశాంక, టీజీ ఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ కుమార్ను నియమించారు. కమిటీ వారంలోగా అధ్యయనం పూర్తి చేసి సమగ్ర విధి విధానాలతో నివేదిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల ఇసుక సరఫరా, గనులశాఖపై సచివాలయంలో సీఎం మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించనున్న నేపథ్యంలో లబ్ధిదారులకు ఇసుక ఏ విధంగా సరఫరా చేయాలనే దానిపై సమగ్రంగా అధ్యయనం చేయాలని చెప్పారు.
రాష్ట్రంలో యేటా నిర్మాణాలు పెరుగుతున్నా ఇసుక నుంచి ప్రభుత్వానికి ఆదాయం ఆశించినంత రావడం లేదని, అదే సమయంలో వినియోగదారులు ఎక్కువ ధరకే ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తుందని తెలిపారు. వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక దక్కేలా చూడాలని, అదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా చూడాలని చెప్పారు. ఇసుక మాఫియాను అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మేజర్, మైనర్ ఖనిజాల గనులకు వేసిన జరిమానాలు వసూళ్లు కాకపోవడంపైనా అధికారులను ప్రశ్నించారు. మేజర్, మైనర్ ఖనిజ విధానంపై సమగ్రంగా అధ్యయనం చేయాలని.. రెండువారాల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. సమావేశంలో సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.