హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): పోలీస్ నియామక పక్రియను వెంటనే చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పోలీస్, వైద్యారోగ్య శాఖల్లో నియామకాలపై సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పోలీస్ శాఖలో ఏడెనిమిదేండ్లుగా నిలిచిపోయిన హోంగార్డుల నియామకాలను చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. హోంగార్డుల ఆరోగ్యం, ఆర్థిక, వైద్య అవసరాలు తీరేలా తగు చర్యలు చేపట్టాలని, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు వారి సేవలను విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవాలని సూచించా రు. ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా, అవకతవకలకు ఆసారం లేకుండా చేపట్టాలని స్పష్టంచేశారు. నియామకాల ప్రక్రియలోని లోటుపాట్లు, వాటిని అధిగమించే అంశాలపై సవివరమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఉద్యోగ నియామకాలపై కూడా నివేదిక ఇవ్వాలని కోరారు. పోలీస్, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం కోరుకొండ సైనిక్ స్కూల్ మాదిరిగా ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటుచేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఉత్తర, దక్షిణ తెలంగాణలో వీటిని ఏర్పాటు చేయాలని చెప్పారు.
విజ్ఞప్తులకు ప్రత్యేక సమయం
సచివాలయానికి వచ్చే ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి మంత్రుల చాంబర్స్లో నిర్దిష్టమైన సమయం, ప్రత్యేక అనుమతులు కల్పించేందుకు అధ్యయనం చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులకు సూచించారు. ప్రజలు హైదరాబాద్ వరకు రాకుండా, ప్రతినెలా రెండు రోజులపాటు పట్టణాలు, గ్రామాల్లో సభలు నిర్వహించి, వారి సమస్యలు అకడే పరిషరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజ్ఞప్తులు, ఫిర్యాదులను డిజిటలైజ్ చేయాలని, వాటి స్టేటస్ను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ప్రజావాణికి అద్భుతమైన స్పందన వస్తున్నందున ఫిర్యాదుల స్వీకరణకు టేబుల్స్ పెంచాలని, కనీస అవసరాలు కల్పించాలని సూచించారు. వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని స్పష్టంచేశారు. శిక్షణలో ఉన్న ఐఏఎస్ల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు.
కాన్వాయ్తో ప్రజలకు ఇబ్బంది రానివ్వొద్దు
సీఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ఇప్పటికే కాన్వాయ్లోని 15 వాహనాలను 9కి తగ్గించామని చెప్పారు. ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి విస్తృత స్థాయిలో పర్యటిస్తానని, తాను ప్రయాణించే మార్గాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు, ప్రభుత్వ కార్యదర్శులు రిజ్వి, శ్రీదేవి, సీఎంవో అధికారులు శేషాద్రి, శివధర్రెడ్డి, షానవాజ్ కాసీం, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు కార్యదర్శి గోపీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ డీఎస్పీ నళినికి అదే ఉద్యోగం?
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో తిరిగి అదే ఉద్యోగం ఇచ్చే అవకాశాలను పరిశీలించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులకు సూచించారు. నళినికి ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు. పోలీస్శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలేమైనా ఉంటే, అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు.