Kadiyam Srihari | తెలంగాణ రాష్ట్రం గురించి పోరాడే చిత్తశుద్ధికే ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మన గొంతును పార్లమెంటులో వినిపించేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సభ్యులను గెలిపించుకోవాలని కోరారు. జనగామ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని అన్నారు. ఓటమి ద్వారా వచ్చిన అనుభవాలను విజయం సాధించే దిశగా ప్రయాణం సాగించాలని సూచించారు.
తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారని.. కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసి గెలిచిందని అన్నారు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఎన్నో మాటలు చెప్పారని గుర్తుచేశారు. డిసెంబర్ 9వ తేదీన రూ.2 లక్షల రుణమాఫీపై సంతకం చేస్తానని.. కొత్తగా రుణాలు తీసుకోవాలని చెప్పారనన్నారు. రైతు భరోసా కింద 3 హామీలను ఇచ్చారని.. రైతులకు ఒక్క హామీ అయినా అమలు అయ్యిందా? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి 60 రోజులు పూర్తయ్యిందని.. కాంగ్రెస్ హామీలను నెరవేర్చిందా అని నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ను సాకుగా చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుందని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి భాష అతని వ్యక్తిత్వాన్ని చెబుతుందని.. సీఎం తన భాష మార్చుకోవాలని సూచించారు. తెలంగాణ హక్కులను కాపాడాలని.. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను రక్షించాలని ప్రజల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారని తెలిపారు.