Revanth Reddy | ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి (159కి.మీ.) అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో గురువారం రాత్రి రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. 2017లోనే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని 161ఏఏ జాతీయ రహదారిగా ప్రకటించారని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. ఇప్పటికే ఈ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో 94 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు.
దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన శ్రీశైలం క్షేత్రాన్ని హైదరాబాద్తో అనుసంధానించే ఎన్.హెచ్-765లో 125 కిలోమీటర్ల దూరం జాతీయ రహదారుల ప్రమాణాలతో ఉందని, మిగిలిన 62 కిలోమీటర్లు ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అటవీ, పర్యావరణ శాఖ నిబంధనల ఫలితంగా ఆ మేరకు రహదారి అభివృద్ధికి ఆటంకంగా ఉందని, కేవలం పగటి వేళలో మాత్రమే రాకపోకలు సాగించాల్సి వస్తోందని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని, ఇందుకు 2024-25 బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా మధ్య 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని ముఖ్యమంత్రి వివరించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ముఖ్య నగరాలైన హైదరాబాద్-విజయవాడ (ఎన్.హెచ్-65) రహదారిని 6 వరుసలుగా విస్తరించే పనుల డీపీఆర్ను త్వరగా పూర్తి చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈ రహదారి విస్తరణ పనుల పూర్తయితే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన వారమవుతామని చెప్పారు. తెలంగాణలోని రెండో పెద్ద నగరమైన వరంగల్ దక్షిణ భాగం బైపాస్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి గడ్కరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ను అనుసంధానించే ఎన్హెచ్-63 (16) వరంగల్, హన్మకొండ నగరాల మధ్యగా వెళుతోందని.. ఈ రహదారిని నగరం వెలుపల నుంచి నాలుగు చోట్ల కలుపుతూ బైపాస్ మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు.
పర్వత్ మాల ప్రాజెక్ట్ లో యాదాద్రి దేవాలయం, నల్గొండ పట్టణంలోని హనుమాన్ కొండ, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద రోప్ వే లను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. గోదావరి, కృష్ణా నదులపై గిరిజనులు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో.. ప్రజా రవాణాకు ఇబ్బందిగా ఉన్న 10 చోట్ల పాంటూన్ బ్రిడ్జిలు మంజూరు చేయాలని, నల్గొండ జిల్లాల్లో ఎన్.హెచ్-65 పక్కన 67 ఎకరాల ప్రభుత్వ భూమిలో ట్రాన్స్పోర్టు ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. .