హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ‘ధర్నా చేసే ముందు నన్ను అడుగాలి. ఉద్యమం చేయడమంటే పద్మవ్యూహంలాంటిది. అందులోకి వెళ్లే ముందే ఎగ్జిట్ అవడం గురించి కూడా ఆలోచించాలి’ ఈ మాటలన్నదెవరో? కాదు సాక్షాత్తు సీఎం రేవంత్రెడ్డి. గురువారం అసెంబ్లీలో ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అయిన సీఎం.. వారితో బెదిరింపు ధోరణిలో మాట్లాడినట్టు తెలిసింది. ప్రభుత్వమిచ్చిన హామీతో లక్ష మందితో నిర్వహించ తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని తాము వాయిదా వేసుకున్నామని జేఏసీ నేతలు సీఎంకు చెప్పారు. ‘ఇక అంతా తనను బెదిరించే వాళ్లే.. ఈ రోజు మీరు, రేపు ఇంకొకరు..’ అంటూ ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం.
ఆరు డీఏలు, పీఆర్సీ, నెలకు రూ.2వేల కోట్ల పెండింగ్ బిల్లుల విడుదల, సీపీఎస్ రద్దు, 2003 డీఎస్సీ ఉద్యోగులకు పాత పింఛన్ అమలు వంటి అంశాలను ఉద్యోగ సంఘాల నేతలు సీఎం ముందు ప్రస్తావించారు. వాటిలో ఏ ఒక్క దానిపైనా సీఎం స్పష్టమైన హామీ ఇవ్వలేదని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు వెల్లడించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్, టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి, జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, పుల్గం దామోదర్రెడ్డి, సుంకరి భిక్షంగౌడ్, ఎస్ఎం హుస్సేనీ (ముజీబ్), బీ శ్యామ్, సదానందంగౌడ్, సీహెచ్ రవి, వెంకట్, గౌతంకుమార్, వంగా రవీందర్రెడ్డి తదితరులు సీఎంతో జరిగిన భేటీలో పాల్గొన్నారు. జేఏసీ నేతలు ప్రస్తావించిన ఆ నాలుగు అంశాలపై సీఎం స్పష్టమైన హామీ ఇవ్వలేకపోవడంతో జేఏసీ నేతలు గందరగోళంలో పడ్డారు.
‘రెండేండ్ల వరకు ఆగండి’ అన్న సీఎం వ్యాఖ్యలను జేఏసీ నేతలు ప్రస్తావించగా తప్పుగా ప్రచారమైందని సీఎం చెప్పినట్టు తెలిసింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఉద్యోగులకు కోటి, కోటిన్నర ఇస్తున్నారన్నది అవాస్తవమని, గ్రాట్యుటీ కింద రూ.16 లక్షలకు మించి రావడం లేదని, ఇచ్చేదంతా ఉద్యోగులు దాచుకున్న డబ్బులేనని సీఎంకు వారు చెప్పారు. ఆరు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. కనీసం రెం డు డీఏలైనా ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రాదేయపడినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ‘మారం జగదీశ్వర్, ఎస్ఎం హుస్సేనీ (ముజీబ్), ఏలూరి శ్రీనివాసరావుతో సబ్ కమిటీ వేస్తా.. ఆర్థిక శాఖను మీరే నడుపుండ్రి’ అంటూ సీఎం వ్యాఖ్యానించారట. పెండింగ్ బిల్లులను నెలకు రెండు వేల కోట్లు విడుదల చేయాలన్న డిమాండ్ను సీఎం నిర్దంద్వంగా తిరస్కరించారట. నా వల్ల కాదంటూ చెప్పినట్టు సమాచారం. ‘ఐదారు రోజుల్లో పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకుంటా.. స్టడీ చేస్తాం.. అసెంబ్లీ తర్వాత మంగళ, బుధవారాల్లో మళ్లీ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో భేటీ అవుతామని సీఎం హామీనిచ్చినట్టు తెలిపారు.