Revanth Reddy | హైదరాబాద్ : వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ ఇదివరకే టీపీసీసీ తీర్మానం చేసి పంపింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం నుంచి పోటీ చేయాలని సోనియా గాంధీని స్వయంగా కోరడానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఉదయం జార్ఖండ్లోని రాంచీకి బయలుదేరి వెళ్లిన రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్నారు. అక్కడి నుంచి సాయంత్రం ఢిల్లీ చేరుకున్న రేవంత్.. సోనియాగాంధీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో సీఎం రేవంత్రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం నుంచి సోనియాగాంధీ పోటీ చేయని పక్షంలో ఎంపీ టికెట్ తనకే ఇవ్వాలని భట్టి విక్రమార్క సతీమణి నందిని ఇప్పటికే డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి పోటీ చేసేందుకు సోనియాగాంధీ సుముఖంగా ఉన్నారో లేదో స్వయంగా అడిగి తెలుసుకుంటే స్పష్టత వస్తుందని సీఎం, డిప్యూటీ భావిస్తున్నారు. సోనియాగాంధీ అభిప్రాయం బయటపడిన తర్వాతనే తన ప్రయత్నాలను ముమ్మరం చేయాలని భట్టి విక్రమార్క భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారు ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీతో సమావేశమైనట్లు గాంధీభవన్ వర్గాల సమాచారం. గాంధీభవన్లో మంగళవారం సాయంత్రం ఎంపీ టికెట్ల అశావాహులపై పీసీసీ సమావేశం కానున్న నేపథ్యంలో సోనియాగాంధీతో సీఎం, డిప్యూటీ సీఎం సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంపీ టిక్కెట్ల అశావాహులు, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీల ఎన్నిక, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలతో పాటు ఈ నెల 8 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాలు తదితర అంశాలు ఈ సందర్భంగా సోనియాగాంధీకి సీఎం రేవంత్రెడ్డి వివరించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏడుసార్లు ఢిల్లీకి వెళ్లారు. డిసెంబర్ 7వ తేదీన సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఇప్పటి వరకు 59 రోజుల్లో సగటున 8 రోజులకోసారి సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లడం గమనార్హం.