CM Revanth Reddy | రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సోమవారం ఐదు జిల్లాల ఇన్చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ నెల 26 తర్వాత జిల్లాల్లో పర్యటన నిర్వహించనున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తొలిసభ గతంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే ఇంద్రవెల్లిలో భారీ సభ నిర్వహించారు.
తాజాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి సభ ఇంద్రవెల్లిలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఇంద్రవెల్లి అమరుల స్మారక స్మృతి వనం కోసం శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ నేతలకు సూచించారు. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి బాధ్యతలు ఉమ్మడి జిల్లాల ఇన్చార్జి మంత్రులకు అప్పగించినట్లు తెలిపారు.
సంక్షేమం, అభివృద్ధిలో అందరూ భాగస్వాములేనని భరోసా ఇచ్చారు. జనవరి 26 తర్వాత ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. వారానికి మూడు రోజులు సాయంత్రం 4 నుంచి 6 వరకు సచివాలయంలో ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని నేతలకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. 17 లోక్సభ స్థానాల్లో 12కు తగ్గకుండా గెలుపొందాలన్నారు.