Revanth Reddy |హైదరాబాద్: విద్యుత్తు రంగ నిపుణులు, వివిధ రాష్ర్టాల విద్యుత్తు విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి, శాసనసభలో చర్చించి.. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర విద్యుత్తు విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సీఎం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో విద్యుత్తు వినియోగం, 24 గంటలపాటు నిరంతర విద్యుత్తు సరఫరా, విద్యుత్తు సంస్థల ఉత్పత్తి, కొత్తగా ఉత్పత్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల్లో ఇచ్చిన గృహజ్యోతి పథకానికి 200 యూనిట్లను అందించడానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు.
రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి, వివిధ కంపెనీల నుంచి విద్యుత్తు కొనుగోళ్లు, రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం, డిస్కంల పనితీరు, ఆర్థిక పరిస్థితిపై సీఎంకు అధికారులు వివరించారు. తెలంగాణ ఏర్పాటైన తరువాత 2014 నుంచి ఇప్పటి వరకు విద్యుత్తు కంపెనీలకు, విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) మధ్య జరిగిన ఒప్పందాలు, ఆ ఒప్పందాల్లోని అంశాలు, విద్యుత్తుకు చెల్లించిన ధరలు వంటివాటిపై సైమగ్రంగా అధ్యయనం చేసి, పూర్తి వివరాలను అందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. ఆర్థిక సంవత్సరాల వారీగా జరిగిన ఒప్పందాలను, వాటిలోని అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు అఇవ్వాలని సీఎం ఆదేశించారు.
తక్కువ ధరకే విద్యుత్తు కొనుగోలు చేయాలి..
ఎక్కువ ధర చెల్లించే విధంగా జరిగిన ఒప్పందాలకు కారణాలేమిటో కూడా నివేదించాలని అధికారులను సీఎం ఆదేశించారు. బహిరంగ మార్కెట్లో ఎక్కడ తక్కువ ధరకు విద్యుత్తు లభిస్తుందో, ఆ కంపెనీల నుంచే విద్యుత్తు కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటిదాకా సరైన విద్యుత్తు పాలసీని రూపొందించకపోవడంతో వివిధ రకాల ఇబ్బందులు, సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్నారు. వివిధ రాష్ర్టాల్లో అమలవుతున్న విద్యుత్తు విధానాలను అధ్యయనం చేయాలని, ఆ రాష్ర్టాల్లోని విద్యుత్తు పరిస్థితులు, మెరుగైన విధానం ఏ రాష్ట్రంలో ఉందో అధ్యయనం చేసి, నివేదికలను ఇవ్వాలని రేవంత్రెడ్డి ఆదేశించారు. అన్ని రాష్ర్టాల కంటే మెరుగైన విద్యుత్తు విధానాన్ని తెలంగాణలో అమలు చేయడానికి నిపుణులతో చర్చించి, అసెంబ్లీలోనూ అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించి, సరికొత్త విద్యుత్తు పాలసీని తీసుకువస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్తుకు ప్రణాళికలు..
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తును ఇచ్చి తీరాలని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలలో ఒకటైన గృహజ్యోతి పథకం ద్వారా ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ పరంగా విద్యుత్తు ఉ్తపత్తిని పెంచడానికి, మరిన్ని విద్యుత్తు సంస్థలను ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలను, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్తు దుర్వినియోగాన్ని అరికట్టాలని, నాణ్యతను పెంచాలని సూచించారు. విద్యుత్తును నిరంతరం సరఫరా చేయడంలో ఎలాంటి అవాంతరాలు రాకుండా పటిష్టంగా, ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.