హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారమే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (కేఆర్ఎంబీ)కి ప్రాజెక్టుల అప్పగింత కొనసాగిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఈ ప్రతిపాదనలు, ప్రక్రియ కొనసాగిందని ఆరోపించారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింత అంశంపై సాగునీటిపాదరులశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, పర్యావరణ అటవీశాఖమంత్రి కొండా సురేఖతో కలిసి సచివాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవంత్రెడ్డి మాట్లాడారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించామంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీమంత్రులు హరీశ్రావు, కేటీఆర్ చేస్తున్నవన్నీ ఆరోపణలేనని పేర్కొన్నారు.
ప్రజలను గందరగోళానికి గురిచేసి రాజకీయ లబ్ధి పొందడం, తమ పాపాలను కప్పిపుచ్చుకోవడం కోసమే ప్రభుత్వంపై కుట్రపూరితంగా అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారమే ప్రాజెక్టుల అప్పగింత జరిగిందని స్పష్టం చేశారు. చట్టం చేసినప్పుడే కృష్ణా, గోదావరి జలాల పంపిణీని కేంద్రానికి అప్పగిస్తున్నట్టు కేసీఆర్ అంగీకరించారని తెలిపారు. అందులో భాగంగా పార్లమెంటులో కేసీఆర్, రాజ్యసభలో కే కేశవరావు ఓటేశారని, అది చట్టం కావడానికి మొదటి కారణం కేసీఆరేనని ఆరోపించారు.
కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలను ఇరు రాష్ర్టాలకు ఎలా పంపిణీ చేయాలనే అంశంపై కేఆర్ఎంబీ 2015లో సమావేశం నిర్వహించిందని, అప్పుడు 50 శాతం వాటా అడగకుండా 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఏపీకి కేటాయించేందుకు కేసీఆర్ సంతకాలు పెట్టారని రేవంత్ ఆరోపించారు. కృష్ణానది 68% తెలంగాణలో ఉందని, 32% మాత్రమే ఏపీలో ఉందని, అంతర్జాతీయ నీటి విధివిధానాల ప్రకారం 500 పైగా టీఎంసీలు తెలంగాణకు, మిగతావి ఏపీకి దక్కాల్సి ఉన్నా సంతకాలు పెట్టి మరీ తెలంగాణకు రావాల్సిన నీటిని శాశ్వతంగా కేసీఆరే ఏపీకి ధారాదత్తం చేశారని మండిపడ్డారు.
15 ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తామని 2022, 2023లో నిర్వహించిన 16వ,17వ కేఆర్ఎంబీ బోర్డు సమావేశాల్లో కేసీఆర్ అంగీకరించారని, 2023-24 బడ్జెట్లో గోదావరి, కృష్ణా బోర్డులకు కలిపి రూ.400 కోట్లు కేటాయించారని తెలిపారు. 2004లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ భాగస్వామని, పోతిరెడ్డిపాడు విస్తరణ నిర్ణయం జరిగినపుడు హరీశ్రావు, నాయిని నర్సింహారెడ్డి రాష్ట్రంలో, కేంద్రంలో కేసీఆర్ మంత్రులుగా ఉన్నారని తెలిపారు. పదవులకు ఆశపడి అనాడు పెదవులు మూసుకున్నారని, పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలించుకుపోతుంటే కొట్లాడింది తెలంగాణ కాంగ్రెస్ నేతలు పీజేఆర్, మర్రి శశిధర్రెడ్డి అని గుర్తుచేశారు. వాళ్లకు సహకరించకుండా వైఎస్కు కేసీఆర్ లొంగిపోయారని మండిపడ్డారు.
14 జనవరి 2020న జగన్ ప్రగతి భవన్లో కేసీఆర్ను కలిసి కృష్ణా జలాలపై 6 గంటలు సమీక్షించారని, అకడే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకు 8టీఎంసీలు తరలించుకుపోయేందుకు కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారని సీఎం ఆరోపించారు. తండ్రి పోతిరెడ్డిపాడుతో రోజుకు 4 టీఎంసీలు తరలించుకుపోతే, కొడుకు రాయలసీమ లిఫ్ట్తో రోజుకు 8 టీఎంసీలు తరలించుకుపోయారని, ఆ పనుల టెండర్కు ఆటంకం రాకుండా ఉండేందుకు సమావేశానికి కూడా వెళ్లకుండా వాయిదా వేయాలని కేంద్రానికి లేఖ రాయించారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ‘ముచ్చుమర్రి’ని ప్రారంభించినది కూడా కేసీఆర్ హయాంలోనేనని ఆరోపించారు. ధనదాహంతోనే తెలంగాణ నీటిని తరలించుకుపోయేందుకు కేసీఆర్ సహకరించారని పేర్కొన్నారు. పదేండ్లలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తిచేయలేదని, ఉమ్మడి రాష్ట్రంలో జరిగినదానికంటే ఎకువగా ఈ పదేండ్లలోనే నిర్లక్ష్యం జరిగిందని తెలిపారు.
పాలమూరు-రంగారెడ్డి పడావు పడిందని వివరించారు. రెండేళ్లలో పూర్తిచేస్తానన్న కేసీఆర్ పదేండ్లయినా పాలమూరు ప్రాజెక్టు పూర్తిచేయలేదని విమర్శించారు. ఇన్ని చేసి ఇప్పుడేమో ఉద్యమాలు చేస్తామంటున్నారని దుయ్యబట్టారు. తెలంగాణకు రావాల్సిన నీటివాటాలు, హకుల కోసం తాము కొట్లాడుతుంటే, అధికారం కోల్పోయి దికుతోచక ఏదో ఒక వంకతో కాంగ్రెస్ను బద్నాం చేయాలని బీఆర్ఎస్ చూస్తున్నదని ఆరోపించారు. తెలంగాణకు న్యాయమైన నీటి కేటాయింపులు తేలిన తర్వాతే ప్రాజెక్టులు అప్పగిస్తామని, ఏపీ, తెలంగాణ ప్రాజెక్టులే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాజెక్టులను కూడా బోర్డు పరిధిలోకి తీసుకోవాలని కేంద్రజల్శక్తిశాఖను కోరామని వెల్లడించారు. తెలంగాణ హక్కుల కోసం అన్ని వేదికలపైనా పోరాడతామని చెప్పారు. ఏపీ, తెలంగాణ మధ్య కాకుండా బేసిన్లోని అన్ని రాష్ర్టాల మధ్య నీటివాటాలను పునఃపంపిణీ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈనెల 16న నిర్వహించబోయే సమావేశానికి హాజరవుతామని, తెలంగాణ హక్కులను కాపాడుతామని వెల్లడించారు.
అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలపై ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నదని, పెండింగ్ ప్రాజెక్టులను మూడు విభాగాలుగా చేసి పూర్తిచేస్తామని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. నిధులు కూడా ప్రత్యేకంగా విడుదల చేస్తామని వెల్లడించారు. 42 కిలోమీటర్ల ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణం రాష్ట్ర విభజన నాటికే 30 కిలోమీటర్లు పూర్తయిందని, గడచిన పదేండ్లలో ఒక కిలోమీటర్ మాత్రమే నిర్మించారని, పూర్తి చేసి ఉంటే దాని కింద లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు-రంగారెడ్డి-కల్వకుర్తి ఎత్తిపోతల పనులు నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిపుణులతో విచారణ జరిపించి నివేదికలు తెప్పిస్తామని, జ్యుడీషియల్ విచారణకు ఇప్పటికే హైకోర్టు న్యాయమూర్తికి లేఖ రాసినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర నీటి హక్కులను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు.
రాష్ట్ర సాగునీటిపారదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేది లేదని తేల్చిచెప్పారు. నీటిపారుదలశాఖను కేసీఆర్ సర్వనాశనం చేశారని ఆరోపించారు. కాళేశ్వరంపై 95 వేల కోట్లు, పాలమూరు ప్రాజెక్టుపై 27,500 కోట్లు, సీతారామ ప్రాజెక్టుపై 7,500కోట్లు ఖర్చుపెట్టి ఒక్క ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వలేదని దుయ్యబట్టారు.
కేంద్రజల్శక్తిశాఖ నిర్వహించిన సమావేశంలో తెలంగాణ వాదనలు సరిగా రికార్డు రాలేదని, తమ వాదనలను స్పష్టంగా రికార్డు చేయాలని ఇప్పటికే కోరామని రేవంత్రెడ్డి తెలిపారు. నాగార్జునసాగర్ను ఏపీ ఆక్రమించుకుంటున్నా కేసీఆర్ చూస్తుండిపోయారని, పల్లెత్తు మాట మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టు జలాలపై, ప్రాజెక్టుల శ్వేతపత్రంపై రెండు రోజులు చర్చిద్దామని, అవి చాలవంటే సమావేశాలను పొడిగిస్తామని, అవసరమైతే ఉభయసభలు నిర్వహిస్తామని తెలిపారు. నిజాయతీ, చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు, కవిత అసెంబ్లీకి రావాలని సవాలు విసిరారు. కేసీఆర్కు పూర్తి అవకాశమిస్తామని, ఒక నిమిషం కూడా మైక్ కట్ చేయబోని తెలిపారు.