హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. తాను మాట్లాడుతున్నది రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలోనన్నది మరిచిపోయి.. పీసీసీ అధ్యక్షుడిగా గాంధీ భవన్లో మాట్లాడుతున్నాననుకొని ఫక్తు రాజకీయ విమర్శలు, వ్యాఖ్యలు చేస్తున్నారు. సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడిన తీరే ఇందుకు నిదర్శనమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
సింగరేణి సంస్థ, బ్యాంకులకు మధ్య జరిగిన ఒప్పందం నేపథ్యంలో సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశానికి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి అసలు విషయాన్ని పక్కన పెట్టి పాత ప్రభుత్వంపై, ప్రతిపక్ష పార్టీలపై దుమ్మెత్తిపోయడానికి ప్రాధాన్యమిచ్చారు. అధికారంలో ఉన్నవారు సచివాలయంలో ప్రభుత్వాధినేతగా.. పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేతగా వ్యవహరించాలి. ఇవన్నీ మర్చిపోయిన రేవంత్రెడ్డి కేవలం రాజకీయ విమర్శలు, గత ప్రభుత్వంపై తన అక్కసును వెళ్లగక్కడానికే సమావేశాన్ని ఉపయోగించుకున్నారు.
బీఆర్ఎస్పై విమర్శలు
బీఆర్ఎస్లో ప్రస్తుతం తండ్రీ కొడుకులు, మామా అల్లుండ్లు తప్ప.. ఎవరూ వారితో ఏకీభవించలేదంటూ సీఎం రేవంత్రెడ్డి రాజకీయ విమర్శలకు దిగారు. శాసనమండలిలో కల్వకుంట్ల కవిత, శాసనసభలో హరీశ్రావు లేదా కేటీఆర్, బహిరంగ సభల్లో కేసీఆర్.. ఈ నల్గురు తప్పితే వేరేవారు ఎవరైనా ఆమోదిస్తున్నారా అంటూ వ్యాఖ్యానించారు. తాము 70 రోజుల్లో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. తాము నియామక పత్రాలు ఇస్తుంటే.. వారి హయాంలోనే నోటిఫికేషన్లు, పరీక్షలు నిర్వహించామంటూ విమర్శలు చేస్తున్నారని, ‘ఇన్ని చేసినోళ్లు.. అదికూడా మీరే చేసి ఉండవచ్చుకదా’ అని విమర్శించారు. తెలంగాణను ఇచ్చింది, తెలంగాణను కాపాడేది, అభివృద్ధి పథంవైపు నడిపించేది, సంక్షేమ పథకాలను అమలు చేసేది కాంగ్రెస్ పార్టీ.. అంటూ ఫక్తు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి మాట్లాడారు.
సింగరేణి ఒప్పందం..
సింగరేణి కార్మికులకు రూ. కోటి ప్రమాద బీమాకు సంబంధించి సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి సమక్షంలో సింగరేణి సంస్థ సీఎండీ బలరామ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీజీఎం భాస్కర్రావు ఒక ఒప్పందంపై సంతకాలు చేసి పత్రాలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా, ఉత్తమ్, పొంగులేటి, శ్రీధర్బాబు, సీతక్క, తుమ్మల, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కార్మిక లోకానికి చరిత్రాత్మకమైన రోజు: భట్టి
సింగరేణిలో రూ. కోటి ప్రమాద బీమా పథకం సంస్థలోని 43 వేల మందికి వర్తిస్తుందని, ఇది చరిత్రాత్మకమైన రోజని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రూ. కోటి ప్రమాద బీమా అమలు చేస్తున్న ప్రభుత్వం తమదేనని అన్నారు. సింగరేణి కార్మికులను కాపాడుకోవాలని ప్రభుత్వం రూ.కోటి ప్రమాద భీమా తీసుకొచ్చినట్టు వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సింగరేణిలో పనిచేసే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులకు రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించామని తెలిపారు.