తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి సంబంధించి 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న ప్రక్రియను సమర్థంగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి నియోజకవర్గ పరిధిలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఒక వేళ పూర్తిగా పట్టణ/నగర నియోజకవర్గమైతే రెండు వార్డులు/ డివిజన్లు, పూర్తిగా గ్రామీణ నియోజకవర్గమైతే రెండు గ్రామాల్లో మొత్తంగా 238 ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టాలని అన్నారు. వార్డులు/ డివిజన్లలో జనాభా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పరిశీలన బృందాల సంఖ్యను పెంచుకోవాలని సూచించారు.
తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వమించారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టు, సేకరించే వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్న గ్రామాలు, వార్డులు/ డివిజన్ల ఎంపిక పూర్తయిందని అధికారులు వివరించారు. పైలట్ ప్రాజెక్టును ఎన్ని రోజుల పాటు చేపడతారని సీఎం ప్రశ్నించగా.. అక్టోబరు 3వ తేదీ నుంచి ఏడో తేదీ వరకు 5 రోజుల పాటు చేపడతామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు అంతా సమ్మతిస్తే కుటుంబం ఫొటో తీయాలని, అదో అప్షనల్గా ఉండాలని అన్నారు. కుటుంబం సమ్మతి లేకుంటే ఆ ఫొటో తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయి పరిశీలనకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు ఉన్న నోడల్ అధికారులు కలెక్టర్లకు మార్గనిర్దేశం చేయాలని.. అప్పుడే పకడ్బందీగా కార్యక్రమం కొనసాగుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం వద్దనున్న రేషన్ కార్డు, పింఛను-స్వయం సహాయక సంఘాలు, రైతు భరోసా, రుణమాఫీ, బీమా, ఆరోగ్య శ్రీ, కంటి వెలుగు తదితర డేటాల ఆధారంగా ఇప్పటికే కుటుంబాల గుర్తింపునకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిందని, పైలట్ ప్రాజెక్టులో దానిని నిర్ధారించుకోవడంతో పాటు కొత్త సభ్యులను జత చేయడం, మృతి చెందిన వారిని తొలగించడం చేస్తామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. కుటుంబ సభ్యుల వివరాల నమోదు, మార్పులు చేర్పుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఎటువంటి పొరపాట్లకు తావివ్వవద్దని హెచ్చరించారు. పైలెట్ ప్రాజెక్టుతో బయటకు వచ్చిన సానుకూలతలు, ఎదురైన ఇబ్బందులతో నివేదిక తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆ నివేదికపై చర్చించి లోపాలను పరిహారించిన అనంతర పూర్తి స్థాయి క్షేత్ర స్థాయి పరిశీలన చేపడదామని ముఖ్యమంత్రి తెలిపారు.