హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో జన్మనిచ్చిన తల్లిదండ్రులను సరిగా పట్టించుకోని బిడ్డలను దారిలోకి తెచ్చేందుకు పేరెంట్స్ చేతిలో ఒక మంత్రదండం పెట్టామని, దానిద్వారా వారిని దారిలో పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగులైన పిల్లలు తమ తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకోవడానికి, దానికి సంబంధించిన వాటికి అనుసంధానమైన విషయాలను పొందుపర్చడానికి తీసుకొచ్చిన ‘తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ, పర్యవేక్షణ బిల్లు’ను సభలో ప్రవేశపెట్టిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. పిల్లల కోసం తల్లిదండ్రులు తమ శక్తినంతా ధారపోస్తారని, పిల్లలు మాత్రం రెకలు వచ్చాక తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని సీఎం వ్యాఖ్యానించారు. వృద్ధ తల్లిదండ్రులకు అండగా నిలవాలనే ఈ చట్టం తీసుకొచ్చామని తెలిపారు. వృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం 2007లో తెచ్చిన చట్టం ప్రకారం తల్లిదండ్రులకు రూ.10 వేలకు మించి ఇచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు.
అందుకే తెలంగాణలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ద్వారా రూ.10వేలు లేదంటే నెలవారీ వేతనంలో 15% ఇవ్వాలనే షరతులు విధించామని చెప్పారు. సమాజం తలదించుకునేలా కొందరు పిల్లలు వ్యవహరిస్తున్నారని, తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడని వ్యక్తిని సామాజికంగా బహిషరించాలని వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులను సరిగా చూసుకోలేనివాడు సమాజంలో బతకడానికి వీల్లేదని పేర్కొన్నారు. తాము తీసుకొచ్చిన చట్టం ఒక్క ప్రభుత్వ ఉద్యోగులకే కాదని, ప్రైవేట్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు కూడా వర్తిస్తుందని వెల్లడించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ఈ బిల్లు ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనాథాశ్రమాలు ఎంతలా పెరిగితే.. సమాజం అంతలా క్షీణిస్తున్నట్టేనని అభిప్రాయపడ్డారు. ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ ఉస్సేన్ మిర్జా మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ.. ‘అమ్మా నీకు వందనమే.. మా తల్లీ నీకు వందనమే’ అనే పాట ద్వారా తల్లిదండ్రుల గొప్పదనాన్ని వివరించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. బిడ్డలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చెయ్యొద్దని కోరారు. అనంతరం ‘తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ, పర్యవేక్షణ బిల్లు’ను ఏకగ్రీవంగా ఆమోదించారు.