హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ‘పేదల జీవితాలపై హైడ్రా పేరుతో బుల్డోజర్లు ప్రయోగించిన సీఎం రేవంత్రెడ్డి.. ఈడీ అమీన్, గడాఫీ, హిట్లర్ లాంటి ప్రపంచ నియంతల బాటలో నడుస్తున్నారు. గతంలో హైడ్రాను భగవద్గీత స్ఫూర్తితో ఏర్పాటు చేశామని చెప్పిన సీఎం.. ఇప్పుడు హిట్లర్ కోర్ టీమ్ పేరుతో నడుపాలని చూస్తున్నారు’ అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ధ్వజమెత్తారు.
అసలు ప్రపంచంలో ఎవరైనా నియంతను స్ఫూర్తిగా తీసుకుంటారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అబద్ధాలు.. అభూత కల్పనలతో సీఎం రేవంత్రెడ్డి పాలన కొనసాగింది.. మిగతా రెండున్నరేండ్లలోనూ ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు. ఐదేండ్ల సినిమాలో ఇప్పుడు ఇంటర్వెల్ వచ్చింది.. అంతే’ అని విమర్శించారు.