Maheshwar Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : ‘సీఎం రేవంత్రెడ్డికి ఆగస్టు భయం పట్టుకున్నది. ఆయన మాటలను ప్రజలు నమ్మడం లేదనే ఇలా ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తానని వరుస ఒట్లు పెడుతున్నడు. ఆగస్టు వరకు రేవంత్ సీఎంగా ఉంటడో లేదో తెలియకనే కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని సీఎం స్థాయి వ్యక్తి అంటున్నడు’ అని బీజేఎల్పీ నేత ఏలేటి మాహేశ్వర్ రెడ్డి దెప్పిపొడిచారు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఒక హామీ కోసమే ఇన్ని ఒట్లు పెడితే, కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటికీ ఇంకెంత మంది దేవుళ్లపై ఒట్లు పెడుతడో!.. ఊరూరు తిరిగి పోచమ్మ, మైసమ్మమీద కూడా ఒట్టు పెడుతడేమో!’ అని ఎద్దేవా చేశారు. ‘సీఎం రేవంత్ రెడ్డి తాను హైటెన్షన్ వైరును అంటున్నడు.. నిన్ను ముట్టుకుంటే షాక్ కొట్టేందుకు ఇదేం మగధీర సినిమా కాదు’ అని దుయ్యబట్టారు.
రేవంత్రెడ్డి ఏ ఊరికి వెళ్లినా అకడి నేతను ‘సీఎం స్థాయి వ్యక్తివి నువ్వే’ అని అంటాడేమో అని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు గోసపడుతున్నారని, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇంత కరువు ఎప్పుడూ రాలేదని గుర్తుచేశారు. అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయిందని, రైతులకు నష్టం కలుగుతున్నా ప్రభుత్వం ధాన్యం కొనడం లేదని, గిట్టుబాటు ధర, రూ.500 బోనస్ ఇవ్వడం లేదని, రుణమాఫీపై సీఎం మాటమార్చి తీరా ఇప్పుడు దేవుళ్లపై ఒట్లు పెట్టుకుంటూ వస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీతో పాటు ఇతర హామీల అమలుకు రూ.లక్ష కోట్లు కావాలని, ఈ లెక్కన ఇతర హామీలకు ఏ స్థాయిలో బడ్జెట్ కావాలో ఊహించుకోవచ్చన్నారు. వీటికి డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. హామీలన్నీ నెరవేర్చకపోతే రాజీనామా చేస్తావా? అని రేవంత్ను ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏ రంగు మారుస్తాడో ఎవరికీ తెలియదని, టీడీపీలో మాదిరిగానే ఇప్పుడూ మాట్లాడుతున్నాడని విమర్శించారు.