హైదరాబాద్, జనవరి9 (నమస్తే తెలంగాణ): వరంగల్ మహానగరంగా అభివృద్ధి చెందేలా విమానాశ్రయానికి రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. వరంగల్ (మామూనూరు) విమానాశ్రయ భూసేకరణ, ఇతర ప్రణాళికలపై ఐసీసీసీలో సీఎం గురువారం రాత్రి సమీక్ష నిర్వహించారు. దక్షిణ కొరియాతోపాటు పలు దేశాలు తమ పెట్టుబడులకు విమానాశ్రయాన్ని ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయని, వాటిని ఆకర్షించేలా వరంగల్ విమానాశ్రయం ఉండాలని అభిప్రాయపడ్డారు.
కొచ్చి విమానాశ్రయం అన్ని వసతులతో ఉంటుందని.. దానిని పరిశీలించాలని అధికారులకు సూచించారు. వరంగల్ ఔటర్రింగురోడ్డు, రేడియల్ రోడ్లు విమానాశ్రయానికి అనుసంధానంగా ఉండాలని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ జిల్లాల ప్రజలు భవిష్యత్తులో వరంగల్ విమానాశ్రయం నుంచే రాకపోకలు సాగించేందుకు వీలుగా రహదారుల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
వరంగల్ విమానాశ్రయం పూర్తయితే మేడారం జాతరతోపాటు లక్నవరం, రామప్ప ఇతర పర్యాటక ప్రదేశాలకు వచ్చే ప్రజలు సైతం దానినే వినియోగించుకుంటారని తెలిపారు. సమీక్షలో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ , సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే జయ్వీర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్అండ్బీ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్ , వరంగల్ కలెక్టర్ సత్య శారద, ఆర్డీవో సత్యపాల్రెడ్డి పాల్గొన్నారు.