హైదరాబాద్: రాజీవ్గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు. ఇందులో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్లో పాసైన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందించనున్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన రాష్ట్రానికి చెందిన 41 మంది అభ్యర్థులతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందన్నారు. త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందని చెప్పారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని చెప్పారు. అందుకే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామన్నారు.
యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని మార్పులు చేశామన్నారు. గ్రూప్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించామని, ప్రస్తుత డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు. నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి గ్రూప్-2 పరీక్ష వాయిదా వేశామని చెప్పారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని వెల్లడించారు. పకడ్బందీ ప్రణాళికతో పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెడుతామన్నారు. ఇక ప్రతీ ఏటా మార్చి నెలలోగా అన్ని శాఖల్లో ఖాళీల వివరాలు తెప్పించుకుంటామని చెప్పారు. జూన్ 2లోగా నోటిఫికేషన్ వేసి డిసెంబర్ 9లోగా నియామక ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సింగరేణి సంస్థను అభినందించారు. మెయిన్స్కు సన్నద్ధం కావడానికి ప్రభుత్వం పక్షాన ఆర్థిక సాయం అందించడం రాష్ట్ర చరిత్రలోనే ఇదే మొదటిసారని చెప్పారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమని, అంతా మెయిన్స్కు ఎంపిక కావాలని అభ్యర్థులకు సూచించారు.