హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): ‘మతకల్లోలాల నుంచి తెలంగాణను, హైదరాబాద్ను గత ప్రభుత్వాలు బయటపడేశాయి. ఈ రోజు గొప్ప స్థాయిలో మన హైదరాబాద్ నగరాన్ని నిలిపాయి. చంద్రబాబునాయుడు, రాజశేఖర్రెడ్డి, కేసీఆర్ వంటి వారి రాజకీయాలు ఎలా ఉన్నా.. హైదరాబాద్ నగర అభివృద్ధి విషయంలో ఎవ్వరూ రాజీపడలేదు. అందుకే గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తాం. అందరి అపోహలు తొలగిస్తాం. వారి ముగ్గురి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని.. హైదరాబాద్ను వేగంగా నడిపించేందుకు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
ఆదివారం నానక్రామ్గూడలో రాష్ట్ర అగ్నిమాపక విభాగం ప్రధాన కార్యాలయ భవనాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం సనత్నగర్ ఫైర్స్టేషన్ను వర్చువల్గా ప్రారంభించి మాట్లాడారు. దేశానికి ఆదాయం అందించటంలో తెలంగాణ రాష్ట్రం కీలకంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లాలు మౌలిక వసతులు, నిర్మాణ రంగంలో దూసుకుపోతున్నాయని పేర్కొన్నారు. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాలతోనే కాకుండా.. ప్రపచంతోనే పోటీపడే స్థాయికి హైదరాబాద్ చేరుకున్నదని చెప్పారు. ఐటీ సెక్టార్లో వచ్చిన పెట్టుబడులు, మార్పులు హైదరాబాద్కు అంతర్జాతీయ స్థాయిని తీసుకొచ్చాయని తెలిపారు. ఏ నగరంలో శాంతిభద్రతలు ఉంటా యో అక్కడికే పెట్టుబడులు వస్తాయని, అందు కే తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నట్టు తెలిపారు.
‘నాకు రాజకీయంగానే అవగాహన ఉన్నది. అది నా వృత్తి. పరిపాలన కావాలంటే అధికారులను అడుగుతాం. ఏవైనా నిర్మించాలంటే నిపుణులను అడుగుతాం. ఇంకేమైనా కావాలంటే సీనియర్ల నిర్ణయాలు తీసుకుంటాం. కొంత ఆలస్యమైనా అనువజ్ఞుల ఆలోచనలు తీసుకుంటాం. పరిపాలనేందో అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం కావాలి. ఏం తెలియకుండా సంతకాలు పెడితే.. శివబాలకృష్ణ ఉన్నట్టు నేను కూడా జైళ్లో ఉండాల్సి వస్తుంది’ అని సీఎం రేవంత్ అన్నారు. ఎయిర్పోర్ట్కు అనుసంధానంగా ఉండే 14 రోడ్లలో 2 నుంచి 3 వేల ఎకరాల్లో 15 క్లస్టర్లుగా ఒక్కోచోట ఒక్కో కంపెనీని విభజించి ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. అక్కడే గేటెడ్ కమ్యూనిటీలు, స్కూల్స్, షాపింగ్మాల్స్ ఉండేలా ఏర్పాటు చేస్తామని చెప్పారు.
లిమిటెడ్ ఇన్వెస్టర్లు ఒకచోట ఉంటే ఏ సమస్య అయినా సులువుగా పరిష్కారం అవుతుందని అన్నారు. త్వరలో అగ్నిమాపకశాఖలో 1000 ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఫైర్ డీజీ సూచన మేరకు పోలీసుశాఖలో ప్రమాదవశాత్తూ చనిపోతే వచ్చే బెనిఫిట్స్ను అగ్నిమాపకశాఖలో కూడా ఇచ్చేవిధంగా ప్రయత్నం చేస్తామని తెలిపారు. పోలీసుశాఖలో ఉండే బెనిఫిట్స్ ఫైర్శాఖకు వర్తించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి ‘మెగా మాస్టర్ ప్లాన్-2050’ తీసుకొస్తామని వెల్లడించారు. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అనే మూడు భాగాలుగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో ఫైర్ డీజీ వై నాగిరెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్, ఏడీజీలు సంజయ్కుమార్ జైన్, సౌమ్యామిశ్రా, సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి తదితరులు పాల్గొన్నారు.