KRMB | హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): వేసవికాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని, అందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి తాగునీటి కోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు (కేఆర్ఎంబీ) లేఖ రాయాలని సూచించారు.
రాబోయే వేసవిలో తాగునీటి సరఫరాలో ఎదురయ్యే సమస్యలను ఎదురొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సాగునీరు, పట్టణాభివృద్ధి, పురపాలక, పంచాయతీరాజ్, తాగునీటి సరఫరాశాఖల అధికారులతో సచివాలయంలో మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి సీఎం రేవంత్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. జలాశయాల్లో నీటి నిల్వలు, వేసవిలో తాగునీటికి అవసరమైన నీటి పరిమాణం తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి నివాస ప్రాంతానికి తాగునీరందేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. తాగునీటి కోసమంటూ నాగార్జునసాగర్ నుంచి ఏపీ 9 టీఎంసీలకుపైగా నీరు తీసుకుపోతున్నదని, అంతపెద్ద మొత్తం లో తాగునీరు ఎకడ వినియోగిస్తున్నారో సరైన గణాంకాలను తీసుకోవాలని, ఇతర అవసరాలకు ఆ నీరు తీసుకుపోకుండా చూడాలని అధికారులకు సూచించారు.
నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి తాగునీటికి నీరు తీసుకునేందుకు వెంటనే కేఆర్ఎంబీకి లేఖ రాయాలని ఆదేశించారు. చివరి అవకాశంగా నారాయణపూర్ జలాశయం నుంచి నీటి విడుదల కోరుతూ కర్ణాటకను అభ్యర్థించాలని తెలిపారు. నిరుపయోగంగా మారిన నీటి వనరులను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అందుకు కాగ్నా నదిని ఉదహరించారు.
అవసరమైన చోట తాగునీటి బోర్లు, బావులు, మోటర్లకు మరమ్మతులు చేయించాలని, ఎమ్మెల్యేలకు కేటాయించిన ఏసీడీపీ నిధుల నుంచి రూ.కోటి, అవసరమైతే అంతకన్నా ఎకువగా వినియోగించుకోవాలని, జూలై ఆఖరి వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని, అందుకు అన్ని జిల్లాల కలెక్టర్లతో రెండు రోజుల్లో సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ పరిధిలోని సిబ్బంది వేతనాలను విడుదల చేయాలని సూచించారు.
గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోనూ తాగునీటికి ఎలాంటి సమస్య లేకుండా చూడాలని కోరారు. నగరంలోని నీటి అవసరాలపై సూక్ష్మస్థాయిలో సమీక్షించి తగిన ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. వేసవి పూర్తయ్యేవరకూ తాగునీటి ట్యాంకర్ల రాకపోకల విషయంలో పోలీసుల నుంచి ఇబ్బంది లేకుండా చూడాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. సమీక్షలో ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సాగర్ను పరిశీలించిన కేఆర్ఎంబీ బృందం
నాగార్జునసాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) బృందం సభ్యులు గురువారం సందర్శించారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఎస్ఈ వరలక్ష్మి, ఈఈ శివశంకర్తో కూడిన బృందం సభ్యులు ఎన్ఎస్పీ ఎస్ఈ నాగేశ్వర్, ఈఈ మల్లికార్జున్తో కలిసి నాగార్జునసాగర్ డ్యాం గ్యాలరీ, క్రస్ట్ గేట్ల రోప్స్, రబ్బర్ సీలింగులు, కుడి కాల్వ గేట్లు, స్పీల్వే, సూట్ గేట్లు, ఆటోమేటిక్ మెషీన్లను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డ్యామ్ నిర్వహణ పనుల పరిశీలనలో భాగంగా సందర్శించినట్టు తెలిపారు. శుక్రవారం జల విద్యుత్తు కేంద్రాలను పరిశీలించనున్నట్టు పేర్కొన్నారు. వీరి వెంట ఎన్ఎస్పీ డీఈఈ శ్రీనివాస్, ఏఈలు కృష్ణయ్య, సత్యనారాయణ ఉన్నారు.