Revanth Reddy | హైదరాబాద్: రాష్ట్రంలోని ఖాళీ పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామని.. త్వరలోనే గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. గ్రూప్-1 ఉద్యోగాలకు అదనంగా రెండేండ్ల వయోపరిమితి అమలు చేయబోతున్నామని తెలిపారు. సచివాలయం సమీపంలోని అంబేడ్కర్ మెమోరియల్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సింగరేణి జాబ్ మేళాలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 441 మందికి కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిదని అన్నారు.
సింగరేణిలో 80 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని నిర్ణయించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సింగరేణి కార్మికుల వయసు పెంపుపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికుల భవిష్యత్ ఆనందకరంగా ఉండాలన్నారు. తెలంగాణలో ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగుల కళ్లలో ఆనందం నింపుతామని తెలిపారు. సింగరేణి గుర్తింపు సంఘంతో చర్చించి అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.