KCR | కల్యాణలక్ష్మీకి తులం బంగారం కలిపి ఇస్తామని చెప్పిండ్రు.. మార్కెట్లో ముఖ్యమంత్రికి, మంత్రులకు తులం బంగారం కొందామంటే దొరకట్లేదా? అని ప్రశ్నించారు. తులం బంగారం ఎందుకు ఇస్తలేరని నిలదీశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన అనంతరం.. సిరిసిల్లలో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. నిన్న 3, 4, 5వ తేదీల్లో విపరీతమైన పెండ్లిళ్లు జరిగాయని.. తులం బంగారం వస్తదేమో అని వాళ్లంతా ఆశపడ్డారని తెలిపారు. ఆ ఆశతోనే మీకు ఓటు వేశారని.. అందుకే మీకు అధికారం వచ్చిందని వివరించారు. తులం బంగారం ఇవ్వకపోతే వాళ్లంతా మిమ్మల్ని తరుముతారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కర్రుకాల్చి వాతపెడతారని పేర్కొన్నారు.
‘ ఎన్ని వాగ్ధానాలు ఎగ్గొట్టారు? మూడు నెలల్లో ఇంత ఆగమా? గొర్రెల యూనిట్లు ఇస్తారనే ఆశతో యాదవ సోదరులు వందల కోట్లు కట్టి ఉన్నారు.. కానీ గొర్రెల యూనిట్లు బంద్ చేసిండ్రు. దానిపై మిమ్మల్ని శిక్షించేందుకు యాదవ సోదరులు రెడీగా ఉన్నారు. ‘ అని కేసీఆర్ అన్నారు. ‘ మేం 1.30 లక్షల మందికి దళితబంధు మంజూరు చేశాం. మేం 10 లక్షలు ఇచ్చేవాళ్లం.. మీరు 12 లక్షలు ఇస్తామని అన్నారు. దాని మీద కూడా ఉలుకులేదు పలుకు లేదు. మేం రిలీజ్ చేసిన డబ్బు కూడా ఫ్రీజ్ చేశారు. అని పేర్కొన్నారు. ఇటువంటి మొద్దు నిద్రపోయే సర్కార్కు బరతలు పెట్టుకుని వాయించుడే కరెక్ట్ అని దళిత సోదరులకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారాలకు వచ్చే వీళ్లను నిలదీయాలని పిలుపునిచ్చారు. అన్న వస్త్రాం ఇస్తారని వెళ్తే.. ఉన్న వస్త్రం ఉడుచుకుపోయిందన్నట్టుగా రాష్ట్రంలో పరిస్థితి మారిందన్నారు. 12 లక్షలు ఇస్తారని మీకు ఓటేస్తే.. పాత 10 లక్షలు మంజూరు చేసుడు లేదు.. కొత్త దానిపై ఊసే లేదని మండిపడ్డారు. దళిత పులులు ఎక్కడికక్కడ గర్జించాలి.. కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ రాకముందు మహత్తరమైన ఇందిరమ్మ రాజ్యంలో రూ..200 పింఛన్లు ఉండేది. కేవలం 200 ఇచ్చి మీరు చేతులు దులుపుకున్నారు. కానీ మేం వచ్చాక 200 రూపాయలను రూ.2వేలు చేసినం. దంపతులు ఇద్దరికి చెరో 200 ఇచ్చినా నాలుగొందలే వస్తది. ముగ్గురికి ఇస్తే ఆరొందలే వస్తది. అదే మనం రెండు వేలు చేసినం కాబట్టి ఒకరికి ఇచ్చినా సరిపోతుందని అనుకున్నాం. అందుకే ఇంటికి ఒకరికి రెండు వేల పింఛన్ ఇచ్చినం. అలా రాష్ట్రంలో దాదాపు 30 లక్షల పింఛన్లు ఉన్నాయి. మేం 2 వేలు ఇస్తే.. మీరు నాలుగు వేలు ఇస్తామని మాట ఇచ్చిండ్రు. అంటే ఇంట్లో ముసలమ్మ ముసలయ్య ఉంటే ఇద్దరికీ ఇస్తామని చెప్పిండ్రు. వాళ్లు ఇంకో 30 లక్షల మంది ఉన్నారు. అంటే మీరు ఎంతమందికి ఎగనామం పెట్టిండ్రు. ఒక నెల అయితే 2వేల పింఛన్లు ఇవ్వలేదు. ఇప్పుడు నాలుగు వేలు లేవు.. మన్ను లేవు.. ఇంకా సిగ్గులేకుండా మీ పాలనను రిఫరెండం అని చెబుతారు. 30 లక్షల కుటుంబాలకు 2 వేలు పాతది మినహాయిస్తే.. డబుల్ ఇస్తామన్నారు కాబట్టి నెలకు 6 వేలు బాకీ ఉన్నారు. నాలుగు నెలలు అయ్యింది.. ప్రతి వృద్ధాప్య పింఛన్ల మీద కాంగ్రెస్ పెట్టిన ఎగనామం 24వేల రూపాయలు. వాళ్లకు ఈ డబ్బు కట్టియ్యాలి. వాటిని కట్టిచ్చేదాకా వేటాడతాం. లేదంటే ఇదేనా రిఫరెండం అని వృద్ధాప్య పింఛన్లు తీసుకునేవాళ్లు కర్రుకాల్చి వాత పెట్టాలి. దీన్ని ప్రజలు రిఫరెండంగా తీసుకోవాలి.’ అని కేసీఆర్ అన్నారు. దళితులకు మోసం… రైతులకు మోసం.. యాదవ సోదరులకు మోసం.. కొత్త రేషన్ కార్డులు ఇస్తామని వాగ్దానం చేసిన మోసం.. మహిళలకు మహాలక్ష్మీ అని పేరు పెట్టి నెలకు 2 వేలు ఇస్తామన్నారు. అది కూడా మోసమే. వీళ్లందరికీ శఠగోపం పెట్టిండ్రు. అని కేసీఆర్ అన్నారు.