CM Revanth Reddy | హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): సీఎం పదవి చేపట్టాక రేవంత్రెడ్డి ఇప్పటివరకూ అయిదుసార్లు ఢిల్లీకి వెళ్లివచ్చారు. గడిచిన నెలరోజుల్లో మొత్తం ఐదుసార్లు హస్తినబాటపట్టారు. సగటున వారానికి ఒకసారికి తగ్గకుండా ఆయన ఢిల్లీ ప్రయాణాలు సాగాయి. తాజాగా, తన రెండురోజుల పర్యటన ముగించుకొని శుక్రవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకొన్నారు. కేంద్ర మంత్రులు, పార్టీ అధిష్ఠానం పెద్దలతోపాటు యూపీఎస్సీ చైర్మన్తో సమావేశాలను ముగించుకొని తిరిగి వచ్చారు.
డిసెంబర్ 6: ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీలతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ప్రత్యేక విమానంలోనే ఢిల్లీకి వెళ్లివచ్చారు.
డిసెంబర్ 8: ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన రేవంత్ పార్టీ అధిష్ఠానంతో చర్చలు జరిపారు. లోక్సభకు హాజరయ్యారు. పార్టీ పదవులపై చర్చించారు.
డిసెంబర్ 19: పార్టీ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్ తదితరులతో సమావేశమయ్యారు. శంషాబాద్ నుంచి సాధారణ ప్రయాణికుల విమానంలో వెళ్లిన ఆయన పార్టీ పీఏసీ తీసుకొన్న నిర్ణయాలపై చర్చించారు. పలువురు సహచర ఎంపీలకు విందు ఏర్పాటు చేశారు. 20 తేదీన హైదరాబాద్కు తిరిగి వచ్చారు.
డిసెంబర్ 26: పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యేందుకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. సీఎంతోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు కూడా వెళ్లారు. 27వ తేదీన తిరిగి వచ్చారు.
జనవరి 4: ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన రేవంత్ అక్కడ పలువురు కేంద్ర మంత్రులు, పార్టీకి సంబంధించిన ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. జనవరి 5న తిరిగి చేరుకొన్నారు.