హైదరాబాద్ : గ్రూప్ -1 మెయిన్స్ అభ్యర్థులకు(Group-1 Mains candidates) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుభాకాంక్షలు తెలిపారు. ఎటువంటి ఆందోళన చెందకుండా పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని, ఈ పరీక్షల్లో విజయం సాధించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని అభ్యర్థులను కోరారు. కాగా, గ్రూప్-1 మెయిన్స్ వాయిదాకు సుప్రీంకోర్టు(Supreme Court) నిరాకరణ తెలిపింది. గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్పై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసేందుకు కూడా త్రిసభ్య ధర్మాసనం నిరాకరించింది. మెయిన్స్ పరీక్షల నిర్వహణలో హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని కోర్టు తెలిపింది. నవంబర్ 20లోగా విచారణ పూర్తి చేయాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్న నేపథ్యంలో.. ఈ దశలో పరీక్షల వాయిదాపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇక పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులను, వారి హాల్ టికెట్లను, గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. పెన్ను, పెన్సిల్, ఎరేజర్ను మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు.