Birudu Rajamallu | పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత బిరుదు రాజమల్లు మృతిపై సీఎం రేవంత్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పీఏసీఎస్ చైర్మన్గా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రాజమల్లు 1994లో పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారని, ఆ ప్రాంత ప్రజలకు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరిన రాజమల్లు పార్టీ గెలుపునకు తన సహకారం అందించారని అన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
రాజమల్లు వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత నెల రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 1930లో ప్రస్తుత పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్లో మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రాజమల్లు.. తన రాజకీయ జీవితాన్ని టీడీపీతో ప్రారంభించారు.
పార్టీలో వివిధ హోదాల్లో పని చేశారు. సుల్తానాబాద్ పీఏసీఎస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. తరువాత 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి గీట్ల ముకుందారెడ్డి చేతిలో ఓడిపోయారు. 1994 ఎన్నికల్లో అదే అభ్యర్థిని 39,677 ఓట్ల మెజార్టీతో గెలుపొంది తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2018లో బీఆర్ఎస్లో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు.