హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ‘ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సీఎం రేవంత్రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేడు. అదే.. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారిని మాత్రం వెంటనే కలుస్తున్నడు. ఆయన తీరుతో కాంగ్రెస్ కార్యకర్తలు బాధపడుతున్నరు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావు విమర్శించారు. అసలైన కాంగ్రెస్వాదులను పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుందని హెచ్చరించారు. శనివారం గాంధీభవన్లో వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం అయ్యాక రేవంత్ ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. మొన్నటి వరకు బీఆర్ఎస్ నేతలను విమర్శించి, ఇప్పుడు వారిని ఎందుకు చేర్చుకుంటున్నారు? ఆయన చుట్టూ మొత్తం భజనపరులు చేరారు. ఆయనను కలవటానికి తమకు అపాయింట్మెంటే ఇవ్వటం లేదు.
నేను 15 సార్లు అడిగినా ఇవ్వలేదు. ఇలా ఒరిజినల్ కాంగ్రెస్వాళ్లకు అన్యాయం చే యొద్దు’ అని వ్యాఖ్యానించారు. సీఎం రేవంతే స్వయంగా ఇతర పార్టీ నేతల ఇండ్లకు వెళ్లి వాళ్లను పార్టీలోకి ఆహ్వానించటంపై వీహెచ్ ఫైర్ అయ్యారు. సీఎంగా స్థాయిని ఆయనే తగ్గించుకుంటున్నారని విమర్శించారు. వాళ్లు మన దగ్గరికి రావాలి గానీ, వాళ్ల వద్దకు వెళ్లటమేమిటని నిలదీశారు. రేవంత్రెడ్డి పూర్తిగా వన్సైడే వింటున్నారని, తమ మాట కూడా వినాలని అన్నారు. తాను కూడా పార్టీలో సీనియర్ అని, సీఎం పదవి రెండుసార్లు తన దగ్గరికి వచ్చి పోయిందని చెప్పారు. ‘నువ్వెంత పాపులరో.. నేను నీ కన్నా ఎక్కు వ పాపులర్’ అని రేవంత్నుద్దేశించి అన్నారు. పార్టీ కోసం ఎంతో చేశానని, అప్పుడున్న అవసరం ఇప్పుడు లేదా? అని నిలదీశారు. ఇప్పటికైనా రేవంత్లో మార్పు రావాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని తెలిపారు. టికెట్ కేటాయింపులపైనా మండిపడ్డారు. ఒకరి ఇంట్లో రెండు, మూడు టికెట్లు ఇవ్వటం ఏమిటి? అని ప్రశ్నించారు.