హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో తన పట్ల రోజురోజుకు ముదురుతున్న అసమ్మతికి ఆదిలోనే అడ్డుకట్టవేసేందుకు పీసీసీ అధినేత, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టి కేంద్రీకరించారు. ఎంపీ అభ్యర్థుల ఖరారులో బిజీగా ఉన్నప్పటికీ, అసమ్మతి నేతలను బుజ్జగించడానికి సమయం కేటాయిస్తున్నారు. ప్రభుత్వంలో తాను వన్మ్యాన్ షో చేస్తున్నారన్న విమర్శలు, ఎంపీ అభ్యర్థుల ఎంపిక తీరుపై సీనియర్ల నిరసన గళం, నామినేటెడ్ పోస్టుల భర్తీలో మంత్రుల మధ్య విభేదాలు, అధిష్ఠానానికి అందుతున్న ఫిర్యాదులు వెరసి సీఎం రేవంత్రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పరిస్థితి చేయి దాటకముందే ఆదిలోనే అసమ్మతిని ఆరికట్టేందుకు రేవంత్ దృష్టి సారించారు. పార్టీని నమ్ముకున్నవారికి కాకుండా ఇతర పార్టీల వారికి ఎంపీ టికెట్లు ఇవ్వడాన్ని సీనియర్ నేతలు నిరంజన్, వీ హనుమంతరావు తీవ్రంగా తప్పుబట్టారు. ముందు నుంచి పార్టీనే నమ్ముకున్నవారికి అన్యాయం చేయొద్దని సీఎం రేవంత్రెడ్డిని కలవాలనుకున్నా, తమకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని వీహెచ్ వ్యక్తంచేసిన ఆవేదన పార్టీలో కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన రేవంత్రెడ్డి.. ఆయనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్ ద్వారా బుధవారం తన ఇంటికి పిలిపించుకున్నారు.
సీనియర్ నేతగా మీ పట్ల (వీహెచ్) తనకు గౌరవం ఉన్నదని, అయితే అత్యధిక ఎంపీ సీట్లను గెలిపించుకొచ్చే బాధ్యతను అధిష్ఠానం మోపడంతో గెలుపుగుర్రాలకు ప్రాధాన్యం ఇవ్వకతప్పలేదని రేవంత్రెడ్డి వివరించినట్టు తెలిసింది. భవిష్యత్తులో మీకు (వీహెచ్)కు సముచిత గౌరవం కల్పించే బాధ్యత నాదేనని, బుజ్జగించినట్టు తెలిసింది. కాంగ్రెస్లో బీసీలకు సముచిత గౌరవం దక్కడం లేదని, ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని వీహెచ్ విజ్ఞప్తి చేశారని సమాచారం. అభ్యర్థుల ఎంపిక ఎన్నికల కమిటీ చూసుకుంటుందని, తాను కేవలం అభిప్రాయం మాత్రమే చెప్పగలనని రేవంత్రెడ్డి స్పష్టంచేసినట్టు తెలిసింది.
నిరంజన్కు బుజ్జగింపు
ఎంపీ అభ్యర్థుల ఎంపికపై పీసీసీ వైఖరిని తప్పుపడుతూ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ఖర్గేకు నిరంజన్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్చౌదరి రెండు రోజుల క్రితం ఆయనను పిలిపించుకొని చర్చించినట్టు తెలిసింది. పార్టీలో లోటుపాట్లపై మీడియాకు ఎక్కకుండా పార్టీ అంతర్గత వేదికలపై స్వేచ్ఛగా వెల్లడించవచ్చని నిరంజన్కు సూచించినట్టు తెలిసింది.
బక్క జడ్సన్కు షోకాజ్
సామాజిక వేదికల్లో సీఎం రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ బుధవారం పార్టీ సీనియర్ నాయకుడు బక్క జడ్సన్కు షోకాజు నోటీసు జారీ చేసింది. దీనికి మూడు రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని గడువు విధించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్రెడ్డి తన సామాజికవర్గానికే పదవులు కట్టబెడుతున్నారని సామాజిక మాధ్యమాల్లో జడ్సన్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి రెండు రోజుల క్రితం జడ్సన్ను తన వద్దకు పిలిపించుకొని సీఎం రేవంత్రెడ్డిపై ఇకనుంచి ఎలాంటి విమర్శలు చేయొద్దని కోరినట్టు తెలిసింది. ప్రభుత్వానికి చెడ్డపేరు రావద్దన్నదే తన ఉద్దేశమని, వ్యక్తిగతంగా తాను ఎవరికీ వ్యతిరేకం కాదని జడ్సన్ స్పష్టంచేసినట్టు తెలిసింది. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపడంలో ఎవరికీ భయపడేది లేదని జడ్సన్ తేల్చిచెప్పిన నేపథ్యంలో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీచేసినట్టు సమాచారం.