CM Revanth Reddy | క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ లు, ఆటో డ్రైవర్ల కోసం రూ.5 లక్షల యాక్సిడెంటల్ పాలసీ తీసుకురావడంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. నాలుగు కిందట స్విగ్గి డెలివరీ బాయ్ కుక్క తరిమితే భవనంపై నుంచి పడి మృతి చెందిన ఘటనలో మృతుడి కుటుంబం వివరాలు సేకరించి సీఎం సహాయనిధి నుంచి ఆ కుటుంబానికి రూ.2 లక్షలు అందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. క్యాబ్ డ్రైవర్ల కోసం ఓలా మాదిరిగా టీ హబ్ ద్వారా ప్రత్యేకంగా యాప్ను అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్ల సమస్యలను తెలుసుకునేందుకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. సామాజిక రక్షణ కల్పించడంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందన్నారు. అసంఘటిత కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామన్నారు. రాహుల్ మాట ఇచ్చారని, ఆ క్రమంలో విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజస్థాన్లో చేసిన చట్టాన్ని అధ్యయనం చేసి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సమర్థవంతమైన చట్టాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు.
సంస్థలు కూడా కేవలం లాభాపేక్ష మాత్రమే చూడకుండా.. కార్మికులు, ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి పెట్టాలన్నారు. గివ్ అండ్ టేక్ పాలసీని పాటించని ఎంత పెద్ద సంస్థలపైనైనా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్కడ దరఖాస్తులు వివరాలు అందించాలని క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్స్కు, ఆటో సీఎం రేవంత్ సూచించారు. డిజిటల్, మాన్యువల్ ఏ రూపంలోనైనా దరఖాస్తులు ఇవ్వొచ్చన్నారు. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి గ్రామసభలు నిర్వహిస్తామన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఇతర నేతలు పాల్గొన్నారు.