హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానంతోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తదితరులను కలువనున్నారు. ఉదయం కాంగ్రెస్ పెద్దలను కలిసి మంత్రవర్గ విస్తరణ, ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రేవంత్రెడ్డి సీఎంగా పదవీబాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీని సాయంత్రం మర్యాదపూర్వకంగా కలువనున్నారు. ఈ మేరకు అపాయింట్మెంట్ దొరికినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై చర్చిస్తారని సమాచారం.
పీసీసీ మార్పుపై చర్చ?
సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా పీసీసీ మార్పుపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నగారా మోగడానికి ముందే పీసీసీని మార్చాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలిసింది. బీసీ నేతను పీసీసీ చీఫ్గా నియమించి పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తే కొంత ఉపయోగం ఉంటుందని అధిష్ఠానం భావిస్తున్నదనే ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ సీఎం రేవంత్రెడ్డినే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిస్తే.. ఒకవైపు పార్టీ బాధ్యతలు, మరోవైపు ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తించడం ఇబ్బందిగా ఉంటుందని, ఆయన మీద పనిభారం పెరుగుతుందని అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం. ఈ కారణంగా ఆయనను పీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి రిలీవ్ చేసి, పూర్తిస్థాయిలో పాలనపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించాలనేది అధిష్ఠానం ఆలోచనగా చెప్తున్నారు. పీసీసీ మార్పుతో రెండు రకాల ప్రయోజనాలు పొందాలన్నది పార్టీ వ్యూహంగా కనిపిస్తున్నది.
ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం
ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో పదవులను ఆశిస్తున్నవారిలో ఆశలు చిగురించాయి. ప్రస్తుతం క్యాబినెట్లో ఆరు మంత్రి పదవులు, ఆరు ఎమ్మెల్సీలు, 54 నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీఎం రేవంత్రెడ్డి అధిష్ఠానం పెద్దలను కలిసిన తరువాత ఆయా పదవుల భర్తీకి గ్రీన్సిగ్నల్ వచ్చే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పదవుల పంపకాలపై సానుకూల నిర్ణయం వెలువడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారు కాగానే ఆయా జిల్లాల్లోని నేతలు హైదరాబాద్కు క్యూ కట్టినట్టు తెలిసింది. తమకు తెలిసిన మంత్రులు, కీలక నేతలతో ఒకమాట చెప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.