హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం సచివాలయంలో జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీ (జేఎన్జే)లో సభ్యులైన అన్ని పత్రికల, టీవీ మీడియాకు చెందిన ప్రధాన ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిశారు. జేఎన్జేకు ఇండ్ల స్థలాల అప్పగింత ప్రక్రియ వంద రోజుల్లోపు మొదలుపెడతామన్న హామీని అమలు చేసినందుకు వారు సీఎంకు కృతఙ్ఞతలు తెలిపారు.
ఇండ్ల స్థలాల అప్పగింతపై రెవెన్యూ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డితో జేఎన్జే ప్రతినిధులు చర్చించి.. ప్రణాళికతో తన దగ్గరకొస్తే వెంటనే సంతకం చేస్తానని సీఎం వారికి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఏ సంస్థకు నామినేటెడ్ చైర్మన్ను నియమించకుండా, కేవలం మీడియా అకాడమీకే చైర్మన్ను నియమించడాన్ని బట్టి తమ ప్రభుత్వం జర్నలిస్టులకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవాలని చెప్పారు. అర్హులైన మిగిలిన జర్నలిస్టులకు కూడా స్థలాలు ఇచ్చే విషయంలో కూడా మీడియా అకాడమీతో చర్చించి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. వీరికి కూడా స్థలాలు ఇస్తామని స్పష్టంచేశారు. జర్నలిస్టుల ఆరోగ్యభద్రతా కార్డులతోపాటు ఇతర సమస్యలపై కూడా దృష్టిసారించామని తెలిపారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా వెంటనే నిర్ణయం తీసుకొంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీనిచ్చారు.