CM Revant Reddy | ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పూర్తి చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాఠశాలల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం కలిగించేలా చర్యలు ఉండాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు తక్షణమే ఉచిత విద్యుత్ అమలయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ఎంసీహెచ్ఆర్డీలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్షించారు. విద్యార్థులకు యూనిఫామ్తోపాటు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, పర్యవేక్షణ బాధ్యతలను స్వయం సహాయక మహిళా సంఘాలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దీని ద్వారా స్కూళ్ల పైన నిరంతర పర్యవేక్షణ ఉండటంతో పాటు మహిళలకు ఆర్థికంగా చేయూతను అందించినట్లు అవుతుందన్నారు.
ఇతర రాస్ట్రాల ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించిన మౌలిక సదుపాయాలను పరిశీలించి రాష్ట్రంలో అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గ్రీన్ ఛానెల్ ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు మంజూరు చేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాల్లో డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేయాలన్నారు. టీ-శాట్ ద్వారా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో డిజిటల్ పాఠాలు బోధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేసే విషయమై దృష్టి సారించాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలలకు సీఎస్ఆర్ ఫండ్స్ సేకరించడానికి ప్రయత్నించాలని, సౌకర్యాలను మెరుగు పరిచేందుకు ఎన్నారైల సహకారం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచాలని సూచించారు. వేసవి సెలవులు ముగిసేలోగా పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. జాతీయ విద్యావిధానంపై విద్యావేత్తలు, మేధావులతో చర్చించాలని ఆయన సూచించారు.
స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు కోసం ఐఎస్బీ తరహాలో గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. న్యాక్ పై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలన్నారు. సచివాలయం నుంచి కిందిస్థాయి వరకు ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ సిస్టం (FRS) తీసుకు వచ్చే అంశంపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.