CM Revant Reddy | హైదరాబాద్ మహా నగర పరిధిలోని వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్గా తీసుకుని విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారి శనివారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్తు నిర్వహణ వ్యవస్థ కేవలం వర్షాకాలంలో మాత్రమే కాకుండా 365 రోజులు పనిచేసేలా రూపొందించాలని చెప్పారు.ఒక్కో విభాగం నుంచి ఒక్కో అధికారి బాధ్యత వహించేలా వ్యవస్థ ఉండాలని, జూన్ నాలుగో తేదీ లోపు పూర్తి ప్రణాళిక సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
నాళాల పూడికతీతలో నిర్లక్ష్యం వహించవద్దని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నాళాల నుంచి పూడిక తీసిన చెత్తను సమీప ప్రాంతాలకు తరలించాలన్నారు. క్వారీ ఏరియాలను గుర్తించి ఆ ప్రాంతాలకు చెత్తను తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.
ఓపెన్ సెల్లార్ గుంతల వద్ద ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాటికి బారీకేడింగ్ ఉండేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. గతంలో జరిగిన సంఘటనలు ఆధారంగా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. కంటోన్మెంట్ ఏరియాలో నాళాల సమస్యలు తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించి చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక నాళాల వద్ద అవసరమైతే ప్రతీ రోజు క్లీనింగ్ చేపట్టాలని వెల్లడించారు.
హైదరాబాద్ నగర పరిధిలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలన్నారు. పవర్ మేనేజ్మెంట్ సరైన విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. పనిచేసే వారిని ప్రోత్సహించి, వారికి ఉన్నత స్థానం కల్పిస్తాం అని అన్నారు.