హన్మకొండ : మహిళల మీద సీఎం కేసీఆర్కు ఎనలేని గౌరవం. మహిళా సాధికారతకు సీఎం కేసీఆర్ చేస్తున్నంత కృషి దేశంలో ఎవరూ చేయడం లేదని పంచాయతీరాజ్ నీటి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయో వృద్ధుల శాఖ అధ్వర్యంలో హన్మకొండలోని అంబేద్కర్ భవన్ లో మంగళవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన పలువురు మహిళలను మంత్రి సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత, ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేయండి. తెలంగాణ వచ్చాక ఎలా ఉంది? అంతకుముందు ఎలా ఉంది? ఈ రంగంలో మనకు వచ్చినన్ని అవార్డులు వేరే ఎవరికి రాలేదన్నారు. మహిళల సంక్షేమం కోసం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.
రూ.40 వేల కోట్లతో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన మంచినీటిని అందించి ఆడబిడ్డల నీటి కష్టాలను తొలగించామన్నారు. మహిళల భద్రత, సంరక్షణకు, సాధికారతకు, అత్యవసర సేవలకు అనేక పథకాలు అమలు అవుతున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్,ఎంపీ పసునూరి దయాకర్,హన్మకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్,వరంగల్ మహానగర మేయర్ గుండు సుధారాణి,ఎమ్మెల్యే అరూరీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.