ఖమ్మం, జూలై 4: సీఎం కేసీఆర్ది టర్బో ఇంజిన్ పాలన అని.. తెలంగాణకు డబుల్ ఇంజిన్ అవసరం లేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని ట్యాంక్బండ్ వద్ద ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని సోమవారం సీపీఐ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావుతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పువ్వాడ మాట్లాడారు. తెలంగాణ చరిత్రను బీజేపీ వక్రీకరించిందని ఆరోపించారు. తెలంగాణ పోరాటంలో తొలి, చివరి దశల్లో క్రియాశీలక పాత్ర పోషించని పార్టీ నాయకత్వానికి తెలంగాణపై మాట్లాడే హక్కు లేదని చెప్పారు. నాడు విన్నూరు రామచంద్రరెడ్డి పెత్తందారితనానికి వ్యతిరేకంగా వేలాది మందితో దండు కట్టి పోరాటం చేసిన వీరుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు. అదే స్ఫూర్తితో తెలంగాణ సాధించి, అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచిన కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం దక్కడం తన అదృష్టమని పువ్వాడ నాగేశ్వర్రావు పేర్కొన్నారు.