నిర్మల్ : టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ప్రకటించి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సీఎం కేసీఆర్ చిత్రపటానికి నిర్మల్ జిల్లా లో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాలాభిషేకం చేశారు. ఇవాళ నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ) మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బి. గంగాధర్, బి. సుబ్బయ్య, సాజిద్ ఖాన్, రొడ్డ ప్రవీణ్ , రొడ్డ రాజేందర్, బి. సురేశ్ తో పాటు 150 మంది టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ జాతీయ పార్టీ ప్రకటనతో ఆయా రాష్ట్రాల ముఖ్య నేతలు, ప్రజలు సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కు ఉన్న ప్రజాదారణ,రాష్ట్ర అభివృద్ధి చూసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్ లో చేరుతున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తుందని విమర్శించారు .
అధానీ, అంబానీల కంపనీలకు కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తూ బడాబాబుల కొమ్ము కాస్తుందని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గులాబీ జెండా ఎగురడం ఖాయమని అన్నారు.