జనగాం: తెలంగాణ వారసత్వ సంపద, కాకతీయుల కళా విశిష్టతను, చారిత్రక ప్రసిద్ధ ఆలయాల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలో వెలసిన స్వయంభు శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, అధికారులు, నిపుణులతో కలిసి సందర్శించారు.
నియోజకవర్గంలో ఉన్న ఐదు ప్రాచీన ఆలయాల పునరుద్ధరణకు ప్రభుత్వం మంజూరుచేసిన రూ. 50 కోట్లతో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శివరాత్రికి పాలకుర్తి కళ్యాణ మండపం ప్రారంభం చేసుకుంటున్నామని,ఆది కవి పాల్కురి సోమనాథుడి విగ్రహం ప్రతిష్టిస్తున్నామని వివరించారు. ఈ ప్రాంతంలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో రూ. 25 కోట్ల వ్యయంతో హరిత హోటల్ను నిర్మిస్తున్నామని వెల్లడించారు.
హోటల్ కోసం స్థలం ఇచ్చిన స్థానికులకు వేరే చోట ఇండ్లు ఇచ్చి, టూరిజంలో ఉద్యోగాలు ఇస్తున్నామని తెలిపారు. బమ్మెరలో 22 అడుగుల పోతన విగ్రహం తయారు చేస్తున్నామని ఆయన తెలిపారు. వల్మిడి గుట్ట పై వాల్మీకి భారీ విగ్రహం పెడుతున్నామని మంత్రి తెలిపారు. వారి వెంట అదనపు కలెక్టర్ ప్రపోల్ దేశాయ్, దేవాలయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నిపుణులు ఉన్నారు.