హైదరాబాద్ : సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు వెయ్యి గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ , నూతనంగా జిల్లాకు ఒకటి చొప్పున 33 బీసీ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అలాగే ఎస్సీ ,ఎస్టీ ,బీసీ మైనార్టీ విద్యార్థి, నిరుద్యోగుల కోసం జిల్లాకు నాలుగు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని, సివిల్ సర్వీస్, పోటీ పరీక్షల కోసం హైదరాబాద్ కేంద్రంగా నాలుగు స్టడీ సర్కిళ్ల ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో కిషోర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు సంక్షోభాలకు నిలయాలుగా ఉండేవి. కానీ, సీఎం కేసీఆర్ దాదాపు 1000 గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేసి నాణ్యమైన కార్పొరేట్ విద్యను ఉచితంగా అందిస్తున్నారని ఆయన తెలిపారు.
అందులో ఉన్నత విద్యను కూడా అందించాలనే గొప్ప మనసుతో సీఎం కేసీఆర్ వాటిని జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేయాలనే నిర్ణయం చారిత్రాత్మకం అన్నారు.
అదే విధంగా మహిళా విద్యను ప్రోత్సహించడం కోసం నూతనంగా జిల్లాకు ఒక బీసీ మహిళా డిగ్రీ కళాశాల చొప్పున 33 గురుకుల కళాశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు.
పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం కోసం నూతనంగా 132 స్టడీ సర్కిళ్ల ను ఏర్పాటు చేయాలనే నిర్ణయం వల్ల రాష్ట్రంలోని లక్షలాదిమంది విద్యార్థులు, యువతకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.