హైదరాబా ద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): ఎలాం టి ఆంక్షలు లేకుండా 18 ఏండ్లు నిండిన ప్రతి ముదిరాజ్, గంగపుత్ర యువతకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో సభ్య త్వం ఇచ్చేలా సీఎం కేసీఆర్ ఆదేశా లు ఇవ్వడం హర్షణీయమని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండా ప్రకాశ్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని లక్షలాది మంది ముదిరాజ్, గంగపుత్రుల యువతకు ప్రయోజనం కలుగుతుందని బుధవారం ఒక ప్రకటనలో చెప్పారు. జీవో నంబర్ 98/1964లో గుర్తించిన కులవృత్తి జాబితాలో ఉన్న సామాజికవర్గాలకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో సభ్యత్వం కావాలంటే అనేక ఆంక్షలు, టెస్టుల పేరుతో కాలయాపన చేయడంతో మత్స్య కార్మికులకు ఇబ్బందులు ఎదురయ్యేవని గుర్తుచేశారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఏర్పడిన నాటి నుంచి ముదిరాజ్, గంగపుత్ర సామాజికవర్గాలకు న్యాయం చేసేందుకు పలుసార్లు సీఎం కేసీఆర్తోపాటు మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. సీఎం కేసీఆర్ తాజా ఆదేశాలు గొప్ప వరంలా ఉన్నాయని పేర్కొన్నారు.