హైదరాబాద్ : దేశానికి దమ్మున్న ప్రధాని ఉంటే 24 గంటల కరెంటు రాదా? అని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఏ దుర్మార్గుడు ఎన్ని కుట్రలు చేసి కాళేశ్వరం, పాలమూరు కాకుండా చేస్తున్నరో తెల్వదా? అయినా తట్టుకొని ఇవాళ 24 గంటల కరెంటు ఇచ్చి, నీళ్లు తీసుకువచ్చినం. పంజాబ్ను తలదన్నేలా పరిస్థితికి తీసుకువచ్చాం. ఇవాళ భారత్లో రెండోస్థానంలో ఉన్నాం. త్వరలోనే తొలిస్థానాన్ని అందుకున్నా ఆశ్చర్యం లేదు. 2004లో కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేస్తే 20 ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకు హరీ లేదు శివా లేదు. అవార్డులు పాస్ చేసేందుకు 20-30 సంవత్సరాలు పడితే.. పర్మిషన్లు ఎన్నడు రావాలే? డిజైన్లు ఎప్పుడు చేయాలి? ప్రాజెక్టులు ఎప్పుడు కట్టాలి? ప్రజలకు నీళ్లు ఎప్పుడు రావాలి? కాంగ్రెస్, బీజేపీతో ఏం కాలేదు. అందుకే బీఆర్ఎస్ను తీసుకువచ్చాం. సమాంతరంగా మోదీ ప్రధాని, నేను ముఖ్యమంత్రిని అయ్యా. చూసీచూసీ విసిగిపోయిన రిటైర్డ్ అయ్యే టైమ్లో దేశం ఇలా అవుతుంటే చూడబుద్ధి కాక బీఆర్ఎస్ను తీసుకువచ్చా’ అన్నారు.
‘అవసరానికి మంచి నీళ్లు దేశంలో ఉన్నాయ్. బాబ్లీ పంచాయతీ తెప్పాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అడిగిండు. కండ్ల ముందు ఇద్రావతి, ప్రాణహిత నదులు కలిసిన తర్వాత 2వేల టీసీఎంలు నీరు సముద్రంలో కలుస్తున్నయ్. దమ్ముంటే రండి.. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలవండి. సన్నాసి సెంట్రల్ గవర్నమెంట్ చేయదు. మనం మనం మాట్లాడుకొని ఒప్పందం చేసుకోండి.. కాళేశ్వరం కట్టుకోలేదా అని మహారాష్ట్రలో చెప్పి వచ్చా. నేను భారతీయున్ని. భారతదేశంలోని ఎకరానికి నీళ్లు రావాలని కోరుకుంటే తప్పా. 40వేల టీఎంసీలతో భారతదేశమంతా సుభిక్షమైతది. మరో 10వేలు డ్రింకింగ్, పరిశ్రమలకు
వాడినా 25-30వేల సర్ప్లస్ ఉంటుంది. ఈ నీళ్ల కోసం ప్రపంచబ్యాంకు అడగాల్సిన అవసరం లేదు. అమెరికా కాళ్లు మొక్కాల్సిన అవసరం లేదు. దీనికి విశ్వగురువులు అవసరం లేదు. దేశ గురువులు ఉంటే చాలు. అందుకే భారత ప్రజలు విశ్వగురువులు వద్దు.. దేశ గురువులు చాలని దేశ ప్రజలు మాకు చెబుతున్నరు. రెండు పనులు ఉన్నయ్ మేం చేసి చూపిస్తాం. వాక్శుద్ధి, చిత్తశుద్ధి, సంకల్ప శుద్ధి ఉంటే.. ప్రజల మేలు కాంక్షిస్తే భగవంతుడు కూడా ఆశీర్వదిస్తడు’ అన్నారు.
‘దేశంలో ఇరిగేషన్ పాలసీని తీసివేసి బంగాళాఖాతంలో పడేసి కొత్త పాలసీని తీసుకువస్తాం. ఖచ్చితంగా రేపు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక ప్రతి ఎకరానికి, మిషన్ భగరీథ కార్యక్రమంలా ఐదేరేళ్లలో ప్రతి ఇంటికీ నీళ్లిస్తాం. నీళ్లు ఎలా మిగులు ఉన్నాయో సర్ప్లస్ పవర్ ఉంది. 361 బిలియన్ టన్నుల బొగ్గుల నిల్వలు ఉన్నాయి. భారతదేశానికి 125 సంవత్సరాలకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నయ్. కోల్ ఇండియా మూడు బొగ్గు గనులకు రైల్వేలైన్ వేయాలని డబ్బులు డిపాజిట్ చేసింది. ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో రైల్వేలైన్ వేయాలని డబ్బులు జమ చేస్తే 15 సంవత్సరాలుగా వేయడం లేదు. కానీ 300 మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేస్తున్నారు. వాళ్ల వ్యాపార స్నేహితులకు సహాయం చేసేందుకు కోల్ను ఆస్ట్రేలియా
నుంచి దిగుమతి చేసుకుంటున్నరు. రాష్ట్రాల జెన్కోల మెడపై కత్తిపెట్టి రూ.3500 టన్నుకు దొరకే బొగ్గును టన్నుకు రూ.35వేల టన్నుకు కొనాలని.. లేకపోతే ఫైన్ వేస్తామని బెదిరిస్తున్నది మోదీ ప్రభుత్వం కాదా? ఇది ప్రజాస్వామ్యమేనా? ఇట్లయితే దేశానికి కరెంటు వస్తదా? దమ్మున్న ప్రధానమంత్రి ఉంటే దేశంలో 24 గంటల కరెంటు రాదా? తెలంగాణలో రాలేదా? అని ప్రశ్నించారు.
‘కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు మొన్న ఎవరో ధర్నా చేశారు 24 గంటల కరెంటు ఇవ్వాలి. ఐదారేళ్ల నుంచి బ్రహ్మాండగా 24 గంటల కరెంటు ఇస్తున్నాం. కొందరు విజ్ఞత, ఇంగితం లేకుండా 24 గంటల కరెంటు వస్తలేదు లేదని మాట్లాడుతున్నరు. నీకు బాధ్యత ఉందా? విపరీతమైన ఇండస్ట్రీలు, విపరీతమైన ఐటీ, వ్యవసాయం విస్తరణ జరుగుతుందని విద్యుత్ను పెంచుకుంటపొమ్మని చెబుతున్న. మొన్న నాలుగు రోజుల కిందట సమీక్ష జరిపాం. గ్రిడ్ కొలాప్స్ కాకుండా ఉండేందుకు హెవీ ట్రాన్స్మీటర్ లైన్ల మీద 50సైకిల్స్ మేయింటెన్ చేయాలి. లేకపోతే గ్రిడ్ కొలాప్స్ అవుతుంది. అనుకోకుండా లోడ్ వస్తే రెండు ఏరియాలో కరెంటు సరఫరా నిలిపివేస్తారు. బడ్జెట్ పెంచాలని కోరితే.. రూ.1500కోట్లు పెంచాం. రోజుకు రూ.28కోట్లు కాదు రూ.38కోట్ల ఇస్తామని చెప్పాం.. నిమిషం కూడా కరెంటు పోవద్దని చెప్పాం. నిమిషం కూడా కరెంటు పోనివ్వం. ఏదైనా బదన్నాం చేస్తా అన్నట్లుగా మాట్లాడితే ప్రజలు గమనించరా? బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కరెంటు ఇస్తున్నరా?. మొన్న 14,649మెగావాట్ల లోడ్ వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత లోడ్ రాలేదు. మార్చి వరకు పెరుగుతుంది.. విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలని చెప్పాం. ప్రభుత్వం 16వేల లోడ్ల వరకు వెళ్లినా విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అన్నారు.