Telangana | 2006 డిసెంబర్ 28.. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలిసారి గులాబీ శ్రేణులు రోడ్డెక్కి రాజీవ్ రహదారిని ముట్టడించిన సందర్భంలోనిదీ దృశ్యం. సాగుకు సరిపడా కరెంటు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ చేపట్టిన ఈ ఆందోళనలో అధినేత కేసీఆర్ కూడా పాల్గొన్నారు. ఆనాటి కరెంటు పోరాటాల అనుభవం నుంచి, రైతు వెతల నుంచి పుట్టిందే.. ‘వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు’. ఇదేదో ఎన్నికల పన్నాగమో, ఓట్లు దండుకునే ఎత్తుగడనో కాదు. పాముకాట్లకో, మిత్తీల పాట్లకో తన ప్రాంత రైతుబిడ్డలు అర్ధాంతరంగా ప్రాణాలు వదులుతుంటే.. వారిని ఎట్లా బతికించుకోవాల్నా అని మథనపడిన కేసీఆర్ మదిలోంచి పుట్టిన పథకమిది. తెలంగాణలో అధికారంలోకి రాగానే ఆ ఆలోచనను ఆచరణలో పెట్టారు. మూడేండ్లలోనే రాష్ర్టానికి కరెంటు కోతలను, రైతుకు విద్యుత్తు వెతలను దూరం చేశారు.
– ఫొటో: అనుమల్ల గంగాధర్
హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): సమైక్యపాలనలో ‘కరెంట్’ అంటేనే ఓ నరకం. ఎప్పుడు వస్తుందో తెలియదు.. ఎప్పుడు పోతుందో తెలియదు. నాటి పాలకులు కరెంట్ విషయంలో పగబట్టినట్టే వ్యవహరించడంతో బోరుబావుల మీదే వ్యవసాయం చేసే తెలంగాణ రైతాంగం దుక్కుల దుఃఖం అనుభవించింది. లోవోల్టేజీ సమస్యలు, కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లతో కష్టాల సాగు చేసింది. ఆగిఆగి పోస్తున్న బోర్లతో ఎండిన పంటనుచూసి కొంతమంది అన్నదాతల గుండెలు ఆగిపోగా.. మరికొందరు కరెంటు వైర్లు పట్టుకొని ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ట్రాన్స్ఫార్మర్లు, మోటర్ల రిపేర్లు చేస్తుండగా కరెంటు తీగలే అన్నదాతపాలిట కాలపాశాలయ్యాయి. పురుగుల మందే రైతులపాలిట పెరుగున్నం అయింది. కండ్లముందే అన్నదాతలు పిట్టల్లా రాలుతున్నా.. నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలకులనుంచి మానవీయ స్పందన కరువైంది. ఆనాడే తెలంగాణలో రైతు కరెంట్ కష్టాలు కేసీఆర్ను కదిలించాయి. 2000 ఆగస్టు 28న విద్యుత్తు చార్జీలకు పెంపునకు నిరసనగా ఉద్యమించిన అన్నదాతలపై చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు జరిపిన కాల్పుల్లో ముగ్గురు రైతుల మృతిచెందడం ఆయనను తీవ్రంగా కలిచివేసింది. ఆ ఘటన జరిగిన వారంలోపే డిప్యూటీ స్పీకర్గా ఉన్న కేసీఆర్.. సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.
విద్యుత్తు చార్జీలను తగ్గించకపోతే రైతుల తరఫున ఉద్యమిస్తానని హెచ్చరించారు. రైతు ఆత్మహత్యలపైనా బాబుతో చర్చించారు. ఆయననుంచి స్పందన రాకపోవడంతో పార్టీ వీడి తెలంగాణ కోసం ఉద్యమించడమే మార్గమని కేసీఆర్ భావించారు. 2001లో టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ పట్టుదలతో 2004 ఎన్నికల్లో ఉచిత విద్యుత్తు అంశం ప్రాధాన్యాంశంగా నిలిచింది. అనంతరం విద్యుత్తు సమస్యలపైనే 2006లో కేసీఆర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు రాజీవ్హ్రదారిపై భారీ ఆందోళన నిర్వహించాయి. కరెంటు కోసమే మొదటిసారి రోడ్డెక్కాయి. ఈ కరెంటు పొలికేక మలిదశ ఉద్యమానికి నాంది పలికింది. తెలంగాణ సాధించాక పక్కా ప్రణాళికలు, మేధోమథనం జరిపి సీఎం కేసీఆర్ తెలంగాణ రైతాంగం కరెంటు కష్టాలను దూరం చేశారు. స్వరాష్ట్రంలో కేవలం మూడున్నరేండ్లలోనే వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఇచ్చి అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపారు. మరి ఇంత మంచి కరెంటు వట్టిగనే రాలే.. దాని వెనుక సీఎం కేసీఆర్ పడ్డ కష్టం ఎంతో ఉంది.
విభిన్న భౌగోళిక పరిస్థితులు..
భౌగోళికంగా తెలంగాణ భూభాగం విభిన్నంగా ఉంటుంది. సాగునీరు అనేది కాలువల ద్వారా అందించడం చాలా కష్టంతోకూడుకున్న చర్య. ఇటు కృష్ణా.. అటు గోదావరి రెండు నదుల కంటే తెలంగాణ భూభాగం ఎత్తులో ఉంటుంది. అందుకే రాష్ట్రంలో వ్యవసాయం బోర్లు, బావులపైనే ఆధారపడి ఉంటుందనేది అక్షరాలా నిజం. ఇదే విషయాన్ని అటు చట్టసభల్లోనూ, ఇటు ప్రజలతోనూ సీఎం కేసీఆర్ అనేక వందలసార్లు చెప్పారు. ఈ బోర్లు, బావుల్లోంచి నీటిని తోడుకునేందుకు విద్యుత్తు అవసరం. కానీ సొంత రాష్ట్రం ఏర్పడేంత వరకుకూడా ఉమ్మడి ప్రభుత్వాలు వ్యవసాయానికి కరెంటు అందించడంపై దృష్టి సారించలేకపోయాయి. దీంతో తెలంగాణ రైతులు తమ పంటలు సాగు చేసుకునేందుకు.. అదృష్టాన్ని, వరుణదేవున్ని నమ్ముకొనేవారు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేసిన ఘనత సీఎం కేసీఆర్దే. అలా మార్చడానికి ఉపయోగపడ్డది 24 గంటల నాణ్యమైన పూర్తి ఉచిత విద్యుత్తు.
అది 2017 డిసెంబరు 31 ఆదివారం అర్ధరాత్రి 12.00 గంటలు.. 2018 నూతన సంవత్సరానికి ప్రపంచం యావత్తూ స్వాగతం పలుకుతూ.. శుభాకాంక్షలు తెలుపుతూ.. సంబురాలు చేసుకుంటున్న సమయం.. తెలంగాణలో నూతన సంవత్సరం ఉత్సవాలను మించిన సంబురాలకు శ్రీకారం చుట్టిన వేళ.. సీఎం కేసీఆర్ కన్న కల నెరవేరిన సందర్భం. తెలంగాణ రైతాంగం యావత్తూ.. సమైక్య పాలనలో పడ్డ కరెంటు కష్టాలకు వీడ్కోలు పలుకుతూ.. 24 గంటల నిరంతరాయ ఉచిత విద్యుత్తుకు స్వాగతం పలికిన శుభ సమయమది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి దాదాపు మూడున్నరేండ్ల కాలంలో పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యల కారణంగా వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల విద్యుత్తు పంపిణీ ప్రారంభమయింది. అప్పటికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు నిరంతర విద్యుత్తు సరఫరా షురూ అయ్యింది. దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు. తెలంగాణ పేరు సువర్ణాక్షరాలతో లిఖించిన సమయం. ఇంతటి ఘన విజయం వెనుక.. సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్ష, పట్టుదల, మార్గదర్శనం, పక్కా ప్రణాళికలు దాగి ఉన్నాయి. ఆ మార్గదర్శనమే ఐదున్నరేండ్లయినా.. తెలంగాణ రైతాంగానికి నిరంతరాయంగా 24 గంటలపాటు పూర్తి ఉచితంగా విద్యుత్తును అందిస్తూనే ఉన్నది.
ఎమ్మెల్యేగా కల.. సీఎంగా సాకారం..
రైతుకు 24 గంటలపాటు విద్యుత్తును అందించాలనే కేసీఆర్ కల మొగ్గ తొడిగింది ఆయన సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే. ‘నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. కరెంటు విషయంలో రైతులు అనేక బాధలు ఎదుర్కొనేవారు..ట్రాన్స్ఫార్మర్ల కోసం పైరవీలు చేయాల్సి వచ్చేది. మంత్రులతో సిఫారసు చేసే పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితిని పూర్తిగా మార్చాలి. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను తక్షణం మార్చేలా వ్యవస్థను రూపొందించాలి..’ అని కేసీఆర్ రైతాంగం పరిస్థితికి కారణాలనుకూడా విద్యుత్తు సంస్థల అధికారులకు స్పష్టంగా చెప్పేవారు. రైతులకు 24 గంటలపాటు నిరంతరాయంగా పూర్తి ఉచితంగా విద్యుత్తు ఇస్తే తప్పేంటి.. అందుబాటులో విద్యుత్తు ఉంటే.. రైతు నిశ్చింతంగా వినూత్నమైన పంటలవైపు దృష్టి సారిస్తారని.. తద్వారా రైతుల కష్టాలు తొలగి.. సంతోషంగా జీవిస్తారని కేసీఆర్కు అపారమైన నమ్మకం. ఆ ఆలోచనపై మేధోమథనం చేశారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే సీఎంగా.. మొదటిసారి విద్యుత్తు అంశంపైనే ఆయన సమీక్షించారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు గురించి ఆ శాఖ అధికారులకు, విద్యుత్తు సంస్థల్లోని ఇంజినీర్లకు వివరించారు. వ్యవసాయానికి 24 గంటల నిరంతరాయ విద్యుత్తుకు శ్రీకారం చుట్టారు.
పక్కాగా ప్రణాళికలు
అప్పటి వరకూ దేశంలోనే అసాధ్యం అనుకున్నదానిని సుసాధ్యం చేయాలనే తలంపుతో సీఎం కేసీఆర్.. విద్యుత్తు సంస్థల ఉన్నతాధికారులతో సమాలోచనలు చేశారు. సమీక్షలు నిర్వహించారు. ఎలాగైనా 24 గంటలపాటు నిరంతరాయంగా.. పూర్తి ఉచిత విద్యుత్తును అందించాలనే ఏకైక లక్ష్యంతో ప్రణాళికలకు రూపకల్పన చేశారు. ట్రాన్స్కో, జెన్కో సీఎండీగా దేవులపల్లి ప్రభాకర్రావును ఎంపిక చేసుకొని ప్రణాళికలను అమలు చేశారు. క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బందితో సమీక్షలు నిర్వహించారు. మూడున్నరేండ్ల పాటు రైతులకు 24 గంటల విద్యుత్తును అందించడాన్ని దృష్టిలో పెట్టుకునే విద్యుత్తు సంస్థల్లో సంస్కరణలు తీసుకొచ్చారు. రాష్ట్రం ఏర్పడేనాటికి కేవలం 7,778 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉండగా.. 2018 మార్చి చివరి నాటికి 15,381 మెగావాట్లకు చేర్చారు. అదికాస్తా 2023 మే నాటికి 18,567 మెగావాట్లుకు చేరింది. యాదాద్రిలో 4000 మెగావాట్లతో సహా మరో 8,705 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ సీఎం కేసీఆర్ ఆలోచనల్లోంచి పుట్టిన థర్మల్ విద్యుత్తు కేంద్రాలే. తన కాళ్లపై తాను నిలబడితేనే విద్యుత్తు అవసరాలు తీరుతాయని భావించిన సీఎం కేసీఆర్ కొత్త థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు జీవం పోశారు.
రూ.వేల కోట్లతో వ్యవస్థల బలోపేతం
‘రైతులకు ఎంత చేసినా తక్కువే’ అని సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెప్తుండే మాట. నిజానికి సాగునీరు, పెట్టుబడి, కావాల్సినంత విద్యుత్తు అందుబాటులో ఉంటే.. రైతులు బంగారం పండిస్తారనేది ఆయన అపారమైన నమ్మకం. ఆ నమ్మకాన్ని సాధించేందుకే రూ.వేల కోట్లను వెచ్చించారు. ట్రాన్స్మిషన్, డిస్కం వ్యవస్థలను 24 గంటల విద్యుత్తును అందించేలా తీర్చిదిద్దేందుకు రూ.18,332 కోట్లను (2017 జనవరి నాటికి) వెచ్చించారంటే సీఎం కేసీఆర్ ఏ స్థాయిలో కసరత్తు చేశారో అర్థమవుతున్నది. ఈ వ్యవస్థల బలోపేతం అనేది భవిష్యత్తు అవసరాలు, డిమాండ్నుకూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలని స్పష్టమైన అనుమతిచ్చారు. ట్రాన్స్మిషన్, డిస్కం వ్యవస్థల బలోపేతానికి ఇప్పటి వరకు రూ. 39,321 కోట్లను (2023 ఏప్రిల్ 30 నాటికి) ఖర్చు చేశారు.
వ్యవసాయానికి మూడో వంతు..
రాష్ట్రంలో వినియోగమయ్యే విద్యుత్తులో దాదాపు 33 శాతం.. అంటే మూడో వంతు విద్యుత్తు వ్యవసాయానికే వినియోగిస్తున్నట్టు అధికారులు లెక్కలు వేశారు. గడిచిన ఎనిమిదేండ్లలో వ్యవసాయానికి వినియోగిస్తున్న విద్యుత్తు ఇలా ఉంది..
సబ్స్టేషన్లు.. ట్రాన్స్ఫార్మర్లు.. ఉద్యోగులు..
ట్రాన్స్కోలో అతిముఖ్యమైన 400 కేవీ సబ్స్టేషన్లు, 220 కేవీ సబ్స్టేషన్లను గణనీయంగా పెంచారు. మొత్తం ఈహెచ్టీ లైన్ల పొడవును భారీగా పొడిగించారు. డిస్కంల పరిధిలో 33 కేవీ సబ్స్టేషన్లను, ఎల్టీ లైన్ల పొడవును పెంచారు. రాష్ట్రం రాకముందు ట్రాన్స్ఫార్మర్ల ఫెయిల్యూర్ శాతం 30 ఉంటే.. దీనిని 7 శాతానికి తగ్గించగలిగారు. లోవోల్టేజీని అరికట్టారు. సుమారు 3.75 లక్షల డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లను అదనంగా చేర్చారు. పీటీఆర్ల సంఖ్యనుకూడా 3,272 నుంచి 5,643కు పెంచడంతో.. ఫెయిల్యూర్ శాతం గణనీయంగా తగ్గింది. ఈ వ్యవస్థలను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో నిర్వహించేందుకు, పర్యవేక్షించేందుకు వీలుగా సిబ్బందిపైకూడా సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. ఇప్పటివరకూ దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఏకంగా 22.5 వేలకుపైగా ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేశారు. దీంతో ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే స్పందించి, కనెక్షన్, విద్యుత్తు అంతరాన్ని అరికట్టగలుగుతున్నారు. దీనికి తోడు 9,909 మంది ఉద్యోగులు, ఇంజినీర్లను విద్యుత్తు సంస్థలు రిక్రూట్ చేసుకున్నాయి. వీటన్నింటివల్లే నేడు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు అందుతున్నది.
మొదట 3 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా..
వ్యవస్థలను బలోపేతం చేసుకొని, స్థాపిత విద్యుత్తు సామర్థ్యాన్ని పెంచిన తర్వాత వ్యవసాయానికి 24 గంటల నిరంతరాయ కరెంట్ సరఫరాను ప్రయోగాత్మకంగా మూడు జిల్లాల్లో మొదలుపెట్టారు. 2017 జూలై 16న ఉమ్మడి మెదక్ జిల్లాలో, జూలై 18న నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో విద్యుత్తు సరఫరాను ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో సాంకేతికంగా ఏర్పడే సమస్యలను గుర్తించి, ఎప్పటికప్పుడు సరిచేసేవారు. ఈ ప్రయోగం జరిగినప్పుడు సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో మాట్లాడేవారు. ఎక్కడ ఎలాంటి సాంకేతిక సమస్య వచ్చినా తక్షణం స్పందించి.. దానిని పరిష్కరించేలా ఆదేశాలిచ్చారు. మూడు జిల్లాల్లో చేపట్టిన ప్రయోగం విజయవంతం కావడంతో.. అప్పటి వరకు బలోపేతం చేసిన ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలకు ఒక్కో జిల్లాను అనుసంధానం చేశారు. ఇలా రాష్ట్రంలోని మొత్తం జిల్లాలను అనుసంధానం చేసిన తర్వాత.. 2017 నవంబర్ 6 నుంచి 19 వరకు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేశారు. ఏర్పడిన సాంకేతిక సమస్యలను, లోటుపాట్లను ఎప్పటికప్పుడు పరిష్కరించారు. 2017 డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలనుంచి రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల సరఫరాను ప్రారంభించారు.
ఎంత ఖర్చయినా కరెంట్ ఇచ్చి తీరుతా: కేసీఆర్
24 గంటల విద్యుత్తుపై తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, కమిట్మెంట్ను బయటపెడుతూ.. 2023 బడ్జెట్ సమావేశాల సందర్భంగా 2023 ఫిబ్రవరి 12న సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన వ్యాఖ్య లు ఇందుకు నిదర్శనం.. ‘30.. 35 ఏండ్లు ఏడ్వలేదా? కరెంటు ఎప్పుడు వస్తదో పోతదో భగవంతుడికే ఎరుక. ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు, స్టెబిలైజర్లు వర్ధిల్లుతుండే. ఆ దుకాండ్లన్నీ మాయమైపోయాయి. ఐదారేండ్ల నుం చి 24 గంటల విద్యుత్తును అందిస్తున్నాం.. అయినా కొందరు గుడ్డుమీద ఈకలు పీకుతున్నరు. అధ్యక్షా.. చాలా బాధ అనిపిస్తుంది. కొంత మంది ఇంగితం లేకుండా.. 24 గంట లు కరెంటు వస్తలేదు అని అంటుంటారు. మన అవసరాల మేరకు ఒక అంచనా ఉంటుంది. నేను విద్యుత్తు శాఖ మంత్రికి, అధికారులకు చెబుతూనే ఉన్నా. ఇండస్ట్రీ, ఐటీ సెక్టార్ పెరుగుతున్నది.
వ్యవసాయం కూడా పెరుగుతున్నది. కాబట్టి మీరు పెంచుకుంటూ పోవాలని చెప్తున్నా. 4 రోజుల క్రితమే విద్యుత్తుపై సమీక్షించిన. గ్రిడ్ వైఫల్యం చెందవద్దని అంటే హెవీ లైన్స్పై 50 సైకిల్స్ ఫ్రీక్వెన్సీ మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. అది షుగర్ బీమార్ లాగా ఉంటుంది. లో షుగర్ కావద్దు. హై షుగర్ కావద్దు. కిందికొచ్చినా.. మీది కొచ్చినా గ్రిడ్ వైఫల్యం చెందుతుంది. అనూహ్యంగా లోడ్ వస్తే.. వెంటనే రెండు ఏరియాల్లో కరెంట్ను కట్ చేస్తారు. రెండు మూడు గంటల తరువాత బ్యాలెన్స్ చేసుకుని కరెంట్ ఇస్తారు. అట్లా కరెంటు తీయవద్దు కదా అని నేను కోపం చేసినా. బడ్జెట్ పెంచాలని అధికారులు చెప్పిం డ్రు. అందుకే ఈ సారి 1500 కోట్లు బడ్జెట్ పెంచినా. అయినా సరిపోదు సార్.. రోజుకు రూ.28 కోట్లు కావాలని అడిగారు. రూ.28 కోట్లు కాదు.. రూ.38 కోట్లు అయినా ఇస్తా.. అని చెప్పిన. ఒక్క నిమిషం కూడా కరెంట్ను పోనీయం. అయితే ఓ వెయ్యి కోట్లు అయితదేమో. వీళ్లేదో (ప్రతిపక్షా లు) ఆశపడుతున్నట్టున్నారు. ఏమన్నా దొరుకుతదేమో.. ఎట్లన్నా బద్నాం చేద్దామేమో అనే ఆలోచనలో ఉన్నట్టున్నారు. ప్రజలు గమనిస్తున్నారు..’ అని వ్యాఖ్యానించారు.