హైదరాబాద్ : మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతల విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. తెలంగాణ భవన్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రైతుబంధుదు సమితి రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్లు దాదాపు 310-340 మంది కీలక నేతలు హాజరయ్యే ఈ సమావేశంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్ని స్థాయిల గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
రాష్ట్రంలో యాసంగి పంటల మార్పిడి, బీజేపీ ధ్వంద్వ విధానాలు, దళిత బంధు కార్యక్రమాలతో పాటు, పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు, పార్టీ శ్రేణులకు శిక్షణతో నామినేటెడ్ పదవుల భర్తీ తదితరుల అంశాలపై విస్తృతంగా చర్చించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ సందడిగా మారింది. ఆహ్వానితులను మాత్రమే లోనికి అనుమతినిస్తూ పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.