CM KCR | మెదక్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): దివ్యాంగులకు పెంచిన రూ.4016 పింఛన్ సొమ్ము పంపిణీకి బుధవారం సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. బీడీ టేకేదారులు, ప్యాకర్లకు రూ.2,016 చొప్పున ఆసరా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్నీ ఆయన ప్రారంభించనున్నారు. ఈ రెండింటి ప్రారంభంతో మరో చారిత్రక ఘట్టానికి మెదక్ పట్టణం వేదిక కానున్నది. మెదక్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీస్ ఆఫీస్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి గుమ్మడిదల, నర్సాపూర్, కౌడిపల్లి మీదుగా మధ్యాహ్నం ఒంటిగంటకు మెదక్ చేరుకోనున్నారు. తొలుత ఆయన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.20 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయాన్ని, మధ్యాహ్నం 1.40 గంటలకు సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మెదక్ సీఎస్ఐ చర్చి గ్రౌండ్లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.
ఆసరా పథకంతో మానవీయతకు నిలువెత్తు నిదర్శనంగా సీఎం కేసీఆర్ నిలిచారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ దివ్యాంగుల పింఛన్ సొమ్మును రూ.500 నుంచి ఏకంగా రూ.1,500కు పెంచారు. రెండోసారి అధికారం చేపట్టాక దానిని రెట్టింపు చేసి రూ.3,016 చొప్పున ఇస్తూ వచ్చారు. దానికి అదనంగా వెయ్యి రూపాయలను పెంచి రూ.4,016 చొప్పున ఇవ్వాలని జూన్ 9న మంచిర్యాల సభలో సీఎం ప్రకటించారు. అతికొద్దికాలంలోనే ఇచ్చిన హామీని అమలు చేస్తూ మెదక్ వేదికగా నేడు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకంలో రాష్ట్రవ్యాప్తంగా 5.50 లక్షల మంది దివ్యాంగులు లబ్ధి పొందనున్నారు.
బీడీ టేకేదారులకు పింఛన్ ఇచ్చి ఆదుకుంటామంటూ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రంలో ఈ హామీని ప్రకటించారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా టేకేదారులకు, ప్యాకర్లకు రూ.2,016 చొప్పున పింఛన్ను ఇచ్చే పథకానికి మెదక్లో శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7,254 మంది టేకేదారులు లబ్ధి పొందనున్నారు. దేశంలోని 16 రాష్ర్టాల్లో బీడీ కార్మికులు ఉన్నా, వారికి పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే కావడం విశేషం. మెదక్లో సీఎం కేసీఆర్ దివ్యాంగుల, టేకేదారుల పింఛన్ల పంపిణీని ప్రారంభించిన అనంతరం, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఏకకాలంలో ప్రారంభించనున్నారు. టేకేదారులు, ప్యాకర్లు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారని తెలంగాణ టేకేదారుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రూప్సింగ్ తెలిపారు.