మహబూబాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి పాలకుల వివక్ష కారణంగా తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబాటుకు గురైంది. అందులోనూ మానుకోట ఏజెన్సీ ప్రాంతం కావడంతో మరింత నిర్లక్ష్యానికి గురైంది. ఫలితంగా ఊళ్లలో ఉపాధి దొరకడం కష్టంగా మారి ఇక్కడి ప్రాంత ప్రజలు ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లేవారు. వానకాలం పంట పండితే అదే గగనమయ్యే పరిస్థితి ఉండేది. రైతులు అప్పుల బాధతో ఇబ్బంది పడేవారు. వైద్య సదుపాయాలు లేక అనారోగ్య సమస్యలతో అవస్థలు పడేవారు.అలాంటి మానుకోట.. నేడు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ప్రగతి బాటలో పయనిస్తున్నది. అత్యాధునిక వసతులు కలిగిన దవాఖాన, మెడికల్ కళాల ఏర్పాటు చేసుకొని ఆరోగ్య ప్రదాయినిగా మారింది. కాళేశ్వరం జలాలతో బీడు భూములను పచ్చని మాగాణంగా మార్చుకున్నది. విశాలమైన సమీకృత కలెక్టరేట్, జిల్లా గ్రంథాలయాన్ని నిర్మించుకొన్నది. ఈ భవన సముదాయాలను గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
ఒకప్పుడు రెవెన్యూ డివిజన్గా ఉన్న మానుకోటను తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ 2016 అక్టోబర్ 11న జిల్లాగా ఏర్పాటు చేశారు. తొర్రూరును రెవెన్యూ డివిజన్ చేయడంతో పాటు గంగారం, చిన్నగూడూరు, దంతాలపల్లి, పెద్దవంగర, సీరోలు, ఇనుగుర్తి గ్రామాలను మండలాలుగా చేశారు. మేజర్ గ్రామ పంచాయతీలుగా ఉన్న తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ ప్రాంతాలను మున్సిపాలిటీలుగా మార్చారు. 231 తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలకు మండల కేంద్రాల నుంచి వందల కోట్లు వెచ్చించి తారురోడ్లు, అంతర్గత సీసీ రోడ్లు నిర్మించారు. పట్టణాల్లో రోడ్ల విస్తరణతో పాటు సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. రోడ్ల మధ్యలో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి పట్టణాలను అందంగా తీర్చిదిద్దారు.
రూ.62.50 కోట్లతో కలెక్టరేట్ నిర్మాణం
జిల్లా కేంద్రానికి కిలోమీటరు దూరంలో ఎన్హెచ్ 365 ప్రధాన రహదారి పక్కన 33 ఎకరాల విశాలమైన స్థలంలో రూ.62.50 కోట్లతో కొత్తగా కలెక్టరేట్ భవన సముదాయాన్ని నిర్మించారు. ప్రధాన రహదారి నుంచి కలెక్టరేట్ భవనం లోపలి వరకు సీసీ రోడ్లు, కలెక్టరేట్ ఆవరణలో గార్డెన్లను ఏర్పాటు చేశారు. గార్డెన్లు, కలెక్టరేట్ భవనం చుట్టూ మొక్కలను నాటారు. రంగురంగుల పూల మొక్కలతో పాటు నీడనిచ్చే మొక్కలను నాటారు. ఈ కలెక్టరేట్ భవనాన్ని గురువారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టరేట్ భవనాన్ని జీప్లస్-2 విధానంలో నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్లో కలెక్టర్, అదనపు కలెక్టర్లతో పాటు ఇతర ముఖ్య అధికారుల చాంబర్లతో పాటు కాన్ఫరెన్స్హాలు, మొదటి, రెండో అంతస్థులో వివిధ శాఖల కోసం గదులను నిర్మించారు.
100 నుంచి 350 పడకలకు విస్తరణ
తెలంగాణ రాక ముందు అరకొర వసతులతో ఏరియా దవాఖాన 100 పడకలతో ఉండేది. ప్రజలు నాణ్యమైన వైద్యం కోసం వరంగల్, ఖమ్మం జిల్లాలకు వెళ్లేవారు. ఇప్పుడు 100 పడకల దవాఖానను 350 పడకల దవాఖానగా అప్గ్రేడ్ చేశారు. నాణ్యమైన వైద్యం అందించేందుకు ఎక్కువ సంఖ్యలో డాక్టర్లను నియమించారు. మెడికల్ కళాశాల రావడంతో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందుబాటులో ఉండటంతో నాణ్యమైన వైద్యం అందుతున్నది. జిల్లా దవాఖానలో ప్రత్యేకంగా ఐసీయూ, డయాలసిస్ కేంద్రం, రక్తనిధి కేంద్రం, తెలంగాణ డయాగ్నొస్టిక్ ఏర్పాటుతో నిత్యం రోగులతో జిల్లా దవాఖాన కిక్కిరిసిపోతున్నది.
ఆధునిక హంగులతో గ్రంథాలయం
ఒకప్పుడు రెండు గదులతో శాఖా గ్రంథాలయంగా పెంకుటింట్లో ఉన్న గ్రంథాలయన్ని జిల్లా గ్రంథాలయంగా అప్గ్రేడ్ చేసి రూ.3 కో ట్లు వెచ్చింది ఆధునిక హంగులతో నిర్మించారు. జీప్లస్+2గా నిర్మించి పాఠకుల కోసం వేల పుస్తకాలు అందుబాటులో ఉంచారు.
వ్యవసాయంలో గణనీయమైన మార్పు
ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో ఒక పంట పండాలంటే గగనం అయ్యేది. 30 నుంచి 40 వేల ఎకరాలు మాత్రమే సాగయ్యేది. యాసంగి సాగుకు అవకాశమే ఉండేది కాదు. తెలంగాణ వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిడ్మానేరు నుంచి ఎస్సారెస్పీ కాలువల ద్వారా జిల్లాలో 930 చెరువులను నింపుతున్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడికతీత ద్వారా నీటి సామర్థ్యం పెరిగి భూగర్భ జలాలు పెరిగాయి. ఉచిత విద్యుత్తో 24 గంటల పాటు వ్యవసాయ మోటర్లు నడుస్తున్నాయి. తెలంగాణ వచ్చాక వానకాలంలో 4.32 లక్షలు, యాసంగిలో 2.50 లక్షల ఎకరాల్లో సాగవుతున్నది.
తండాలకు మహర్దశ
231 గ్రామ పంచాయతీలతో ఉన్న జిల్లాలో..500 జనాభా కలిగిన ప్రతి తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడంతో ఇప్పుడు 461 గ్రామ పంచాయతీలకు చేరింది. పల్లెప్రగతి ద్వారా గ్రామాలు, తండాల రూపు రేఖలు మారిపోయాయి. ప్రతి జీపీకి పల్లెప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్యార్డులు, నర్సరీలు ఏర్పాటు చేయడంతో తండాలకు మహర్దశ పట్టింది. జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయం, సమీకృత మార్కెట్ నిర్మాణం, తొర్రూరులో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మరిపెడలో రూ.3.02 కోట్లతో మాడల్ మార్కెట్, రూ.1.90 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మించారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్లలో సుమారు రూ.200 కోట్లతో సీసీరోడ్లు, డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగ్ తదితర అభివృద్ధి పనులు చేపట్టారు.
నెరవేరిన ‘వైద్య’ కల
గిరిజన జిల్లా అయిన మానుకోటకు సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా వైద్య కళాశాలను కేటాయించారు. సుమారు రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేశారు. నిరుడు నవంబర్ 15న జిల్లా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ తరగతులను సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈసారి కూడా 150 ఎంబీబీఎస్ సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉండటంతో చాలా మంది స్థానికంగానే వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ హాస్టళ్లను కూడా నిర్మిస్తున్నారు.
మానుకోట జిల్లా స్వరూపం
మొత్తం జనాభా సుమారు : 8 లక్షలు
గిరిజన జనాభా : 60 శాతం
మొత్తం గ్రామపంచాయతీలు : 461
కొత్తగా వచ్చిన పరిశ్రమలు : 318
వానకాలంలో సాగు విస్తీర్ణం : 4.32 లక్షల ఎకరాలు
యాసంగిలో సాగు విస్తీర్ణం :
2.50 లక్షల ఎకరాలు
జిల్లాలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు : 2,000
మున్సిపాలిటీల సంఖ్య : 4