CM KCR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో ప్రత్యేక హెలికాప్టర్లో మంచిర్యాల జిల్లాకు బయల్దేరనున్నారు. సీఎం హోదాలో మూడోసారి జిల్లాకు వస్తుండడంతో అధికారులు, నాయకులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ను, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్ ద్వారా నూతన కలెక్టరేట్ ప్రాంగణంలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. రూ.60 లక్షలతో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ను కుర్చీలో కూర్చొబెడతారు. అక్కడి నుంచి తిరిగి కలెక్టరేట్కు చేరుకొని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(ఐడీవోసీ)ని ప్రారంభిస్తారు. అక్కడే రూ.1,748 కోట్లతో చెన్నూర్, పర్ధాన్పల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు, రూ.510 కోట్లతో మెడికల్ కాలేజీ, రూ.500 కోట్లతో మందమర్రి దగ్గర ఏర్పాటు చేయనున్న ఆయిల్ పాం ఫ్యాక్టరీలకు శంకుస్థాపన చేస్తారు. గోదావరిపై రూ.164 కోట్లతో నిర్మించే మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జికి కొబ్బరికాయ కొడతారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. అక్కడ గృహలక్ష్మి, కులవృత్తులకు రూ.లక్ష ఆర్థిక సాయం, గొల్ల, కురుమలకు రెండో విడుత గొర్రెల పంపిణీ పథకాలను ప్రారంభిస్తారు.