హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. జగిత్యాల పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని, రూ. 49.20 కోట్లతో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం రూ.119 కోట్ల అంచనాలతో 27 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న మెడికల్ కాలేజీ భవనం, అనుబంధ హాస్పిటల్కు భూమి పూజ చేయనున్నారు.
భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు జగిత్యాల అర్బన్ మండలంలోని మోతె గ్రామ శివారులో నిర్వహించే భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టరేట్ను అందంగా అలంకరించారు. బహిరంగ సభా స్థలి వద్ద బారికేడ్లు, డయాస్ను ఏర్పాటు చేశారు.
మరోవైపు జగిత్యాల జిల్లా కేంద్రం గులాబీ వర్ణంలోకి మారిపోయింది. ఎటు చూసినా సీఎం కేసీఆర్ను ఆహ్వానిస్తూ పెద్ద ఫ్లెక్సీలు, కటౌట్లను ఏర్పాటు చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ నాలుగు రోజులుగా జగిత్యాలలోనే మకాం వేసి అన్ని ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పటికే పలుమార్లు వచ్చి ప్రజాప్రతినిధులకు మార్గనిర్దేశనం చేశారు.